కెప్టెన్‌గా రోహిత్: 2023 వన్టే జట్టును ప్రకటించిన ఐసీసీ

by Dishanational2 |
కెప్టెన్‌గా రోహిత్: 2023 వన్టే జట్టును ప్రకటించిన ఐసీసీ
X

దిశ, స్పోర్ట్స్: 2023 సంవత్సరానికి గాను ఐసీసీ వన్డే జట్టును మంగళవారం ప్రకటించింది. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో రాణించిన రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అంతేగాక ఈ జాబితాలో భారత్ నుంచి మొత్తం ఆరుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది. అలాగే ఆస్ట్రేలియా నుంచి ఇద్దరు, దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు ఉండగా.. న్యూజిలాండ్‌కు చెందిన మరొక ప్లేయర్ ఉన్నారు. రోహిత్ శర్మ 2023లో 52సగటుతో 1255 పరుగులు సాధించడంతో పాటు.. జట్టును ముందుండి నడిపించాడు. ఇక హిట్ మ్యాన్‌తో పాటు ఇండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీలు ఐసీసీ వన్టే జట్టులో ఉన్నారు.

వికెట్ కీపర్‌గా దక్షిణాఫ్రికా ప్లేయర్

ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2023 వికెట్ కీపర్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన హెన్రిచ్ క్లాసెన్ ఎంపికయ్యారు. 2023లో అతను అనేక గొప్ప ఇన్నింగ్సులు ఆడాడు. అలాగే దక్షిణాఫ్రికా పేసర్ మార్కో జాన్సెన్ సైతం జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆయన బౌలింగ్, బ్యాటింగ్‌లో గతేడాది మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. ఇక ఆస్ట్రేలియా నుంచి ఆడమ్ జంపా, వరల్డ్ కప్ ఫైనల్ లో రాణించిన ట్రావిస్ హెడ్ ఉన్నారు. అంతేగాక ఈ జట్టులో చోటు సంపాదించిన న్యూజిలాండ్ స్టార్ డారిల్ మిచెల్ గతేడాది ఐదు సెంచరీలు చేయగా.. 52.34 సగటుతో మొత్తం 1204 పరుగులు చేశాడు.

ఐసీసీ ప్రకటించిన జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సన్, ఆడమ్ జంపా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ.


Next Story