అదరగొట్టిన అమ్మాయిలు.. ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌ భారత్‌దే

by Harish |

ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ల సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది.

అదరగొట్టిన అమ్మాయిలు.. ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌ భారత్‌దే
X

దిశ, స్పోర్ట్స్ : భారత అమ్మాయిలు అదరగొట్టారు. పసికూన ఐర్లాండ్‌ను ఊచకోతకోశారు. ఫలితంగా వన్డేల్లో భారత్ అత్యధిక స్కోరును నమోదు చేసింది. అంతేకాకుండా, వరుసగా రెండో వన్డేలోనూ ఐర్లాండ్‌ను చిత్తు చేసింది. దీంతో 2-0తో ఆధిక్యంలోకి వెళ్లి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. రాజ్‌కోట్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 116 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 370/5 స్కోరు చేసింది. వన్డే క్రికెట్‌లో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. జెమిమా రోడ్రిగ్స్(102) సెంచరీ చేయగా.. హర్లీన్ డియోల్(89), స్మృతి మంధాన(73), ప్రాతిక రావల్(67) సైతం రెచ్చిపోయారు. ఆ తర్వాత ఛేదనలో పోరాడిన ఐర్లాండ్ 254/7 స్కోరే చేసింది. మిగతా బ్యాటర్ల సహకారం లేకపోవడంతో కౌల్టర్ రీల్లీ(80) పోరాటం వృథా అయ్యింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ(3/37), ప్రియా మిశ్రా(2/53) ఆకట్టుకున్నారు. సిరీస్ భారత్ కైవసం కావడంతో బుధవారం జరిగే ఆఖరి వన్డే నామమాత్రమే కానుంది.

ఆ నలుగురు ఐర్లాండ్‌ను ఊచకోతకోసి..

టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ పరుగుల వరద పారించింది. టాపార్డర్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. మొదట ఈ దూకుడును మొదలుపెట్టింది ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రాతిక రావల్. వీరిద్దరూ తమ ఫామ్‌ను కొనసాగిస్తూ జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఈ క్రమంలోనే ప్రాతిక వరుసగా రెండో హాఫ్ సెంచరీని నమోదు చేసింది. మరోవైపు, ప్రాతికతో పోలిస్తే స్మృతి మంధాన దూకుడుగా ఆడింది. 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. ఈ జోడీ తొలి వికెట్‌కు 156 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. అయితే, వరుస ఓవర్లలోనే వీరిద్దరూ పెవిలియన్ చేరారు. ఆ తర్వాత ఆ దూకుడును హర్లీన్ డియోల్, రోడ్రిగ్స్ కొనసాగించారు. బౌండరీల మోత మోగించిన వీరు ఐర్లాండ్ బౌలర్లను ఉతికారేశారు. ఈ క్రమంలోనే రోడ్రిగ్స్ తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేసింది. హర్లీన్ డియోల్ తృటిలో సెంచరీని చేజార్చుకుంది. మూడో వికెట్‌కు ఈ జంట 183 పరుగులు జతచేయడంతో భారత్ భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ పోరాటం చేసింది. కానీ, భారత బౌలర్లు పసికూన నిలువరించారు. ఐర్లాండ్ జట్టులో కౌల్టర్ రీల్లీ(80) అద్భుతమైన పోరాట పటిమ కనబర్చింది. మిగతా బ్యాటర్ల నుంచి సరైన సహకారం అందకపోయినా ఒంటరి పోరాటం చేసింది. ఓపెనర్ సారాహ్ ఫోర్బ్స్(38), లారా డెలానీ(37) చెప్పుకోదగ్గ పరుగులు చేయగా.. మిగతా వారు తేలిపోయారు. దీంతో ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 254 పరుగులే చేసింది.

సంక్షిప్త స్కోరుబోర్డు

భారత్ ఇన్నింగ్స్ : 370/5(50 ఓవర్లు)

(స్మృతి మంధాన 73, ప్రాతిక రావల్ 67, హర్లీన్ డియోల్ 89, రోడ్రిగ్స్ 102)

ఐర్లాండ్ ఇన్నింగ్స్ : 254/7(50 ఓవర్లు)

(కౌల్టర్ రీల్లీ 80, సారాహ్ ఫోర్బ్స్ 38, దీప్తి శర్మ 3/37, ప్రియా మిశ్రా 2/53)


Next Story