ఇషా సింగ్ జట్టుకు రజతం.. రిథమ్ సాంగ్వాన్‌కు పారిస్ ఒలింపిక్స్ బెర్త్

by Dishanational3 |
ఇషా సింగ్ జట్టుకు రజతం.. రిథమ్ సాంగ్వాన్‌కు పారిస్ ఒలింపిక్స్ బెర్త్
X

దిశ, స్పోర్ట్స్ : ఇండోనేషియాలో జరుగుతున్న ఏషియన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్ సత్తాచాటింది. ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్‌లో వ్యక్తిగత కేటగిరీ, టీమ్ కేటగిరీలో స్వర్ణం సాధించింది. అంతేకాకుండా, పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. గురువారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టోల్ టీమ్ ఈవెంట్‌లో రజతం సాధించింది. రిథమ్ సాంగ్వాన్, ఇషా సింగ్, సిమ్రాన్‌ప్రీత్ కౌర్‌లతో కూడిన భారత జట్టు 1743 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి రజతం గెలుచుకుంది. కొరియా జట్టు(1750 స్కోరు) విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో భారత్‌కు మరో పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖరారైంది. మహిళల 25 మీటర్ల పిస్టోల్ ఈవెంట్‌లో రిథమ్ సాంగ్వాన్ 28 స్కోరుతో కాంస్య పతకం దక్కించుకోవడంతోపాటు ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. దీంతో షూటింగ్‌లో భారత్‌కు 16వ ఒలింపిక్స్ బెర్త్ దక్కింది. గత ఒలింపిక్స్‌లతో పోలిస్తే పారిస్ ఒలింపిక్స్‌కు భారత్ అత్యధిక సంఖ్యలో షూటర్లను పంపడం విశేషం. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 15 షూటర్లు పాల్గొన్నారు. టోర్నీలో భారత్ 23 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Next Story

Most Viewed