'ఆసియా కప్‌కు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమే'.. శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక ప్రకటన

by Disha Web Desk 13 |
ఆసియా కప్‌కు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమే.. శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక ప్రకటన
X

న్యూఢిల్లీ : ఆసియా కప్-2023 నిర్వహణపై సందిగ్ధం నెలకొన్న సమయంలో శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్‌ఎల్‌సి) కీలక ప్రకటన చేసింది. ఆసియా కప్‌ను నిర్వహించేందుకు తాము సిద్ధమేనని ఎస్‌ఎల్‌సి ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే, ఆ నిర్ణయం మాత్రం ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) చేతుల్లోనే ఉందని చెప్పారు. తాము బీసీసీఐ వెంట ఉంటామని సదరు అధికారి పేర్కొన్నారు. కాగా, ఆసియా కప్-2023 ఆతిథ్య హక్కులు పాకిస్తాన్ వద్ద ఉన్నాయి. అయితే, ఆటగాళ్ల భద్రత కారణాల దృష్ట్యా తాము పాక్‌లో పర్యటించబోమని, తటస్థ వేదికగా టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ సెక్రటరీ జైషా స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

దాంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ నజమ్ సేథీ ఏసీసీ ముందు హైబ్రిడ్ మోడల్‌ను ప్రతిపాదించారు. భారత్ మ్యాచ్‌లు తటస్థ వేదికగా నిర్వహిస్తామని, మిగతా మ్యాచ్‌లు పాక్‌లో జరుగుతాయని చెప్పారు. అయితే, ఈ హైబ్రిడ్ మోడల్‌ను బీసీసీఐ తోసిపుచ్చింది. శ్రీలంక లేదా బంగ్లాదేశ్ వేదికగా టోర్నీ నిర్వహించడం ఉత్తమమని బీసీసీఐ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో తాము ఆసియా కప్ నిర్వహించడానికి సిద్ధమేనని శ్రీలంక క్రికెట్ బోర్డు వెల్లడించింది. అయితే, త్వరలో జరగబోయే ఏసీసీ మీటింగ్‌లోనే టోర్నీపై నిర్ణయం తీసుకుంటామని ఇటీవల ఏసీసీ చీఫ్ జైషా వెల్లడించిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed