రెండు టెస్టుకు జడేజా, రాహుల్ దూరం.. ఆ ముగ్గురిని ఎంపిక చేసిన సెలెక్టర్లు

by Dishanational3 |
రెండు టెస్టుకు జడేజా, రాహుల్ దూరం.. ఆ ముగ్గురిని ఎంపిక చేసిన సెలెక్టర్లు
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను టీమ్ ఇండియా ఓటమితో ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో అనూహ్యంగా రోహిత్ సేన 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు జరగనుంది. సిరీస్‌లో 1-0తో వెనుకబడిన భారత్.. రెండో టెస్టులో నెగ్గి పుంజుకోవాలనుకుంటుంది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ ఇండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బ్యాటర్ కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయాల కారణంగా ఆ మ్యాచ్‌కు దూరమయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ సోమవారం వెల్లడించింది. ‘తొలి టెస్టులో నాలుగో రోజు జడేజా స్నాయువుతో బాధపడగా.. కేఎల్ రాహుల్ కుడి కాలు తొడకండరాలు నొప్పితో ఇబ్బందిపడ్డాడు.’ అని బోర్డు తెలిపింది. ప్రస్తుతం వీరిద్దరూ బీసీసీఐ మెడికల్ పర్యవేక్షణలో ఉన్నట్టు పేర్కొంది. జట్టులో కీలకమైన వీరు రెండో టెస్టుకు దూరమవడం భారత్‌కు భారీ లోటే అని చెప్పొచ్చు.

జడేజా, కేఎల్ రాహుల్ దూరమవడంతో రెండో టెస్టు కోసం భారత జట్టులో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. వారి స్థానాలను సెలెక్టర్లు భర్తీ చేశారు. బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, స్పిన్ ఆల్‌రౌండర్లు సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌‌లను జట్టులోకి తీసుకున్నారు. సుందర్ 2021 మార్చిలో ఇంగ్లాండ్‌పై చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. దాదాపు మూడేళ్ల తర్వాత అతను తిరిగి టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. మరోవైపు, సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్‌ తొలిసారిగా టెస్టు జట్టు నుంచి పిలుపు అందుకున్నారు. ఈ ముగ్గురు ఇంగ్లాండ్ లయన్స్‌తో అనధికార టెస్టు సిరీస్‌ ఆడుతున్న భారత ఏ జట్టులో సభ్యులుగా ఉన్నారు. రెండో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్(161) భారీ సెంచరీ కొట్టాడు. అదే మ్యాచ్‌లో సౌరభ్ కుమార్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో సహా 6 వికెట్లు తీశాడు. తమ ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించడంతో వారికి టెస్టు జట్టును పిలుపు వచ్చింది. యువ పేసర్ అవేశ్ ఖాన్ రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ జట్టుతో కొనసాగుతాడని, అవసరముంటే అతన్ని టెస్టు జట్టులోకి తీసుకుంటామని బీసీసీఐ తెలిపింది.


Next Story

Most Viewed