Ranji Trophy Final : రెచ్చిపోయిన ముంబై బ్యాటర్లు.. విదర్భ ముందు 538 పరుగుల టార్గెట్

by Harish |
Ranji Trophy Final : రెచ్చిపోయిన ముంబై బ్యాటర్లు.. విదర్భ ముందు 538 పరుగుల టార్గెట్
X

దిశ, స్పోర్ట్స్ : విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యా్చ్‌లో ముంబై జట్టు విజయానికి బాటలు వేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు చెలరేగడంతో ఆ జట్టు ప్రత్యర్థి ముందు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 119 కలుపుకుని 538 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించింది. ఓవర్‌నైట్ స్కోరు 141/2తో మంగళవారం ఆట కొనసాగించిన ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 418 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ బ్యాటర్ ముషీర్ ఖాన్(136) భారీ సెంచరీతో కదం తొక్కాడు. రెండో రోజు హాఫ్ సెంచరీ చేసిన కెప్టెన్ అజింక్యా రహానే(73) ఆరంభంలోనే అవుటవ్వగా.. ముషీర్ ఖాన్‌కు శ్రేయస్ అయ్యర్ తోడయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపర్చిన అయ్యర్ రెండో ఇన్నింగ్స్‌లో సత్తాచాటాడు. ముషీర్ నిదానంగా ఆడి 255 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. మరో ఎండ్‌లో ధాటిగా ఆడిన అయ్యర్ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే శతకం దిశగా వెళ్లిన అయ్యర్(95) క్యాచ్ అవుటై తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ జోడీ నాలుగో వికెట్‌కు 168 పరుగుల భాగస్వామ్యం జత చేయగా.. అప్పటికే స్కోరు 300 దాటేసింది.

అయితే, విదర్భ బౌలర్లు పుంజుకోవడంతో 25 పరుగుల వ్యవధిలోనే ముంబై జట్టు.. అయ్యర్, ముషీర్ ఖాన్‌లతోపాటు హార్దిక్(5), శార్దూల్ ఠాకూర్(0) వికెట్లు కోల్పోయింది. అయితే, షామ్స్ ములానీ(50 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరవడంతో స్కోరు 400 దాటింది. విదర్భ బౌలర్లలో హర్ష్ దూబే(5/144) ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా.. యశ్ ఠాకూర్ 3 వికెట్లతో సత్తాచాటాడు. మూడో రోజు ఆఖర్లో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన విదర్భ వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. అథర్వ(3 బ్యాటింగ), ధ్రువ్(7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆ జట్టు ఇంకా 528 పరుగుల వెనుకంజలో ఉంది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండగా విదర్భ బ్యాటర్లు ముంబై బౌలర్లను ఎదుర్కొని నిలబడతారా? అనేది వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed