మయాంక్ అగర్వాల్ ఫిట్.. తమిళనాడుతో మ్యాచ్‌కు అందుబాటులోకి

by Dishanational3 |
మయాంక్ అగర్వాల్ ఫిట్.. తమిళనాడుతో మ్యాచ్‌కు అందుబాటులోకి
X

దిశ, స్పోర్ట్స్ : ఇటీవల అస్వస్థతకు గురైన టీమ్ ఇండియా బ్యాటర్, కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ కోలుకున్నాడు. తాజాగా అతను ఫిట్‌నెస్ క్లియరెన్స్ కూడా పొందాడు. దీంతో రంజీ ట్రోఫీలో కర్ణాటక జట్టుకు తిరిగి అందుబాటులోకి రానున్నాడు. ఈ నెల 9 నుంచి 12 వరకు తమిళనాడుతో జరిగే కీలకమైన మ్యాచ్‌లో జట్టును నడిపించనున్నాడు. అస్వస్థత కారణంగా రైల్వేస్‌తో జరిగిన గత మ్యాచ్‌కు మయాంక్ దూరంగా ఉన్నాడు. ఆ మ్యాచ్‌లో విజయం సాధించడానికి తీవ్రంగా కర్ణాటక తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరకు ఒక్క వికెట్ తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్‌లో మయాంక్ లోటు స్పష్టంగా కనిపించిందనే చెప్పాలి. రంజీ ట్రోఫీలో మయాంక్ కెప్టెన్‌గానే కాకుండా ప్లేయర్‌గా కర్ణాటక విజయాల్లో అతను కీలక పాత్ర పోషిస్తున్నాడు. 4 మ్యాచ్‌ల్లో 44 సగటుతో 310 పరుగులు చేశాడు. అందులో రెండు శతకాలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. కీలకమైన తమిళనాడుతో మ్యాచ్‌కు మయాంక్ తిరిగి అందుబాటులోకి రావడంతో కర్ణాటక బలం పెరిగినట్టైంది.

కాగా, రంజీట్రోఫీలో భాగంగా గత వారం త్రిపుర‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఢిల్లీకి విమానంలో బయలుదేరాడు. విమానంలో మంచి నీళ్లుగా భావించి అతను హానికర ద్రవం తాగడంతో అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గొంత వాపు బాధపడిన అతను.. రెండు సార్లు వాంతులు కూడా చేసుకున్నాడు. అప్పటికి ఇంకా విమానం టేకాఫ్ కాకపోవడంతో వెంటనే సిబ్బంది మయాంక్‌ను హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాతి రోజునే డిశ్చార్జ్ అయిన అతను బెంగళూరుకు వచ్చాడు.

Next Story

Most Viewed