వ‌రంగ‌ల్‌లోనూ రంజీ మ్యాచ్‌లు : హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు

by Harish |
వ‌రంగ‌ల్‌లోనూ రంజీ మ్యాచ్‌లు : హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు
X

వ‌రంగ‌ల్‌: అధునాతన హంగులతో వరంగల్‌లో కొత్త స్టేడియాన్ని నిర్మిస్తామని, దీనిపై అపెక్స్ కౌన్సిల్‌లో చ‌ర్చిస్తామ‌ని హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 29 కేంద్రాల్లో హెచ్‌సీఏ నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరాలు సోమవారం ముగిశాయి. వరంగల్‌లోని లాల్ బహుదూర్ క్రీడా మైదానంలో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ ముగింపు వేడుకల్లో జగన్‌మోహన్ రావు మాట్లాడుతూ.. వ‌రంగ‌ల్‌లోనూ రంజీ మ్యాచ్‌లు నిర్వహించేందుకు ప్రయత్నిస్తామన్నారు.

ప్రతి జిల్లాలోనూ ఒక మంచి స్టేడియాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి టీ20 క్రికెట్ టోర్నమెంట్‌ నిర్వహిస్తామని, ప్రతి జిల్లా నుంచి ఒక జట్టుకు అవకాశం ఇస్తామని తెలిపారు. గ్రామాల్లో ఉన్న ప్రతిభావంతులను గుర్తించడానికే సమ్మర్ క్యాంప్‌లను భారీ స్థాయిలో నిర్వహించామని, అందుకోసం రూ.1.50 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,500 మంది వర్ధమాన క్రికెటర్లు శిక్షణ పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు దల్జిత్ సింగ్, సహాయ కార్యదర్శి బసవరాజు, వరంగల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ గౌడ్‌, కార్యదర్శి చాగంటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు జమీర్ అహ్మద్ నజీముద్దీన్, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed