- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : భారత దిగ్గజ షూటర్, మాజీ ఒలింపియన్ రణధీర్ సింగ్ ఇక లేరు. ఆదివారం ఆయన మరణించారు. 79 ఏళ్ల రణధీర్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈక్రమంలోనే బుధవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి భారత క్రీడా లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భారత క్రీడా రంగంపై షూటర్గా, అడ్మినిస్ట్రేటర్గా ఆయన ముద్ర వేశారు. ఆసియా గేమ్స్లో బంగారు పతకం సాధించిన తొలి భారత షూటర్గా చరిత్ర సృష్టించారు. 1978 ఎడిషన్లో పురుషుల ట్రాప్ ఈవెంట్లో ఆయన గోల్డ్ మెడల్ సాధించారు. 1968 మెక్సికో సిటీ, 1972 మునిచ్, 1976 మాంట్రియల్, 1980 మాస్కో, 1984 లాస్ ఏంజిల్ ఒలింపిక్స్ల్లో ఆయన భారత్కు ప్రాతినిధ్యం వహించారు. భారత షూటింగ్కు ఆయన చేసిన సేవలకుగానూ భారత ప్రభుత్వం 1979లో ఆయనకు అర్జున అవార్డు ప్రదానం చేసింది. 1994లో షూటింగ్కు రిటైర్మెంట్ ప్రకటించగా స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్గా కూడా వివిధ హోదాల్లో పనిచేశారు. 1991 నుంచి 2015 వరకు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా(ఓసీఏ) జనరల్ సెక్రెటరీగా ఉన్నారు. 2021లో తాత్కాలిక అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ఇక, 2024లో ఆయన వోసీఏ ప్రెసిడెంట్ అయ్యారు. ఓసీఏ ప్రెసిడెంట్ అయిన తొలి భారతీయుడు ఆయనే. 2028 వరకు ఆయన పదవీకాలం ఉండగా అనారోగ్యం కారణంగా ఈ ఏడాది ఆయన పదవీకి రాజీనామా చేశారు. 2011 నుంచి 2014 వరకు ఇంటర్నేషన్ ఒలింపిక్ కమిటీలో భారత్ నుంచి ఏకైక ప్రతినిధిగా ఉన్న ఆయన 2010లో కామన్వెల్ గేమ్స్కు ఇండియా ఆతిథ్యమివ్వడంలో కీలక పాత్ర పోషించారు. రణదీర్ సింగ్ మృతి పట్ల నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ఆర్ఏఐ) సంతాపం వ్యక్తం చేసింది.






