తెలుగమ్మాయికి బీసీసీఐ అవార్డు.. ద్రవిడ్, మిథాలీ, బిన్నీలకు జీవిత సాఫల్య పురస్కారం

by Harish |

తెలుగమ్మాయికి బీసీసీఐ అవార్డు.. ద్రవిడ్, మిథాలీ, బిన్నీలకు జీవిత సాఫల్య పురస్కారం
X

దిశ, స్పోర్ట్స్ : ప్రతి ఏటా వివిధ విభాగాల్లో ఇచ్చే నమన్ అవార్డులను బీసీసీఐ శనివారం ప్రకటించింది. ఢిల్లీలో ఆదివారం అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. భారత దిగ్గజ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, రోజర్ బిన్నీ, మిథాలీ రాజ్‌లకు లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డులను ప్రకటించింది. భారత క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా వారిని సత్కరించనుంది. నేడు జరిగే కార్యక్రమంలో ద్రవిడ్, బిన్నీలకు బీసీసీఐ అత్యున్నత గౌరవమైన కల్నల్ సీ.కే నాయుడు జీవిత సాఫల్య పురస్కారం, మిథాలీకి బీసీసీఐ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు అందజేయనుంది. ఈ ముగ్గురు భారత క్రికెట్‌కు అత్యుత్తమ సేవలందించారు. బిన్నీ 1983 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అలాగే, అతని కోచింగ్‌లో 2000లో అండర్-19 జట్టు వరల్డ్ కప్ గెలిచింది. ఆ తర్వాత 2012-16 వరకు జాతీయ సెలెక్టర్‌గా వ్యవహరించారు. 2022 నుంచి గతేడాది వరకు ఆయన బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు, రాహుల్ ద్రవిడ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ది వాల్’గా గుర్తింపు పొందిన అతను అంతర్జాతీయ క్రికెట్‌లో 24,000 రన్స్ చేశాడు. కెప్టెన్‌గా కూడా చేశాడు. అలాగే, నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) హెడ్‌గా యువ క్రికెటర్లను తయారు చేశాడు. ప్రస్తుతం భారత జట్టు మూడు ఫార్మాట్లలో వేర్వేరు టీమ్‌లతో ఆడే సామర్థ్యం కలిగి ఉందంటే ఒకరకంగా ద్రవిడే కారణం. అలాగే, ద్రవిడ్ 2021-24 వరకు టీమిండియా హెడ్‌ కోచ్‌గా ఉండగా.. అతని హయాంలోనే భారత జట్టు 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక, హైదరాబాద్‌కు చెందిన మిథాలీ రాజ్ భారత మహిళా క్రికెట్‌‌కు మార్గదర్శి. సుదీర్ఘ కాలం జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆమె దాదాపు 18 ఏళ్లపాటు కెప్టెన్‌గా వ్యవహరించింది. సారథిగా మహిళల క్రికెట్‌లో భారత జట్టును ఉన్నత స్థానంలో నిలబెట్టింది. వన్డేల్లో 7,805 రన్స్ చేయగా అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఆమె పేరిటే ఉంది. ఆమె కెప్టెన్సీలో భారత జట్టు రెండుసార్లు వరల్డ్ కప్ ఫైనల్స్‌కు వెళ్లింది.

గిల్‌కు రెండోసారి..స్మృతికి ఐదోసారి

2024-25కు సంబంధించి పాలీ ఉమ్రిగర్ అవార్డు(ఇంటర్నేషనల్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్) భారత టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను వరించింది. 2024-25లో టెస్టు, వన్డే ఫార్మాట్లలో అతను అదరగొట్టాడు. 9 టెస్టుల్లో 983 రన్స్ చేశాడు. 11 వన్డే మ్యాచ్‌ల్లో 490 రన్స్ సాధించాడు. ఉత్తమ క్రికెటర్‌గా అవార్డు గెలవడం గిల్‌కు ఇది రెండోసారి. తొలిసారి 2024లో అవార్డు సాధించాడు. ఇక, మహిళల విభాగంలో స్మృతి మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు మళ్లీ సొంతం చేసుకుంది. ఆమె వరుసగా రెండోసారి, మొత్తంగా ఐదోసారి ఉత్తమ క్రికెటర్‌గా నిలవడం విశేషం. 2018-19, 2020-21, 2021-22, 2024-25కు సంబంధించి అవార్డు సొంతం చేసుకుంది. గతేడాది భారత మహిళల జట్టు తొలిసారిగా వన్డే వరల్డ్ కప్ గెలవడంలో ఆమెది కీలక పాత్ర. 434 రన్స్ చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసింది. అలాగే, వన్డేల్లో ఐదు శతకాలు బాది ఓ ఏడాదిలో అత్యధిక సెంచరీలు చేసిన క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. అలాగే, వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన అవార్డు కూడా స్మృతినే గెలిచింది. అత్యధిక వికెట్లు తీసిన అవార్డు దీప్తి శర్మకు దక్కింది.

అరంగేట్రంలోనే సత్తాచాటిన శ్రీచరణి

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్పిన్నర్ శ్రీచరణి గతేడాదే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. వచ్చి రావడంతోనే అద్భుత ప్రదర్శన చేసిన ఆమె ఏకంగా వరల్డ్ కప్‌ జట్టులో చోటు సంపాదించింది. భారత జట్టు ప్రపంచకప్ గెలవడంలో శ్రీచరిణి పాత్ర కూడా ఎంతో ఉంది. 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి భళా అనిపించింది. ద్వైపాక్షిక సిరీస్‌ల్లోనూ మెరిసింది. దీంతో శ్రీచరణి బెస్ట్ డెబ్యూ క్రీడాకారిణిగా అవార్డు సొంతం చేసుకుంది. పురుషుల విభాగంలో పేసర్ హర్షిత్ రాణా ఈ అవార్డు గెలిచాడు. దేశవాళీలో ఆల్‌రౌండర్లకు ఇచ్చే లాలా అమర్నాథ్ అవార్డు ఆయుశ్ మాత్రే(పరిమిత ఓవర్లు), హర్ష్ దూబె(రంజీ ట్రోఫీ) గెలిచారు. పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి ముంబై జట్టు నాలుగు టైటిల్స్ గెలవగా.. ముంబై క్రికెట్ అసోసియేషన్‌‌కు బీసీసీఐ అవార్డు దక్కింది.


Next Story