మలేషియా మాస్టర్స్‌లో సింధు శుభారంభం.. సింగిల్స్ కెరీర్‌లో 450వ విజయం

by Harish |
మలేషియా మాస్టర్స్‌లో సింధు శుభారంభం.. సింగిల్స్ కెరీర్‌లో 450వ విజయం
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కీలక మైలురాయిని సాధించింది. సింగిల్స్ కెరీర్‌లో 450వ విజయాన్ని నమోదు చేసింది. మలేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో ఆమె తొలి రౌండ్ నెగ్గడంతో ఈ ఫీట్ నెలకొల్పింది. కౌలాలంపూర్‌లో జరుగుతున్న టోర్నీలో సింధు శుభారంభం చేసింది. ఇటీవల ప్రతిష్టాత్మక ఉబెర్ కప్‌కు దూరంగా ఉన్న ఆమె విజయంతో తిరిగి ఆటను మొదలుపెట్టింది. బుధవారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధు 27-17. 21-16 తేడాతో స్కాట్లాండ్‌కు చెందిన కిర్స్టీ గిల్మర్‌పై విజయం సాధించింది. స్పష్టమైన ఆధిపత్యం కనబర్చిన సింధు 46 నిమిషాల్లో వరుసగా రెండు గేమ్‌లను గెలుచుకుని ప్రత్యర్థి ఆటను ముగించింది. దీంతో సింగిల్స్ కెరీర్‌లో ఆమె 450వ విజయాన్ని అందుకుంది. అలాగే, ఈ టోర్నీలో ప్రీక్వార్టర్స్‌కు చేరుకుంది. గురువారం జరిగే ప్రీక్వార్టర్స్‌లో సౌత్ కొరియాకు చెందిన సిమ్ యు జిన్‌తో ఆమె తలపడనుంది.

మరో మ్యాచ్‌లో అష్మిత 21-17, 21-16 తేడాతో చైనీస్ తైపీ షట్లర్ లిన్ సియు హిన్‌ను ఓడించి రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. యువ క్రీడాకారిణులు ఆకర్షి కశ్యప్, ఉన్నతి హుడా తొలి రౌండ్‌లోనే ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించారు. మెన్స్ సింగిల్స్‌లో యువ ఆటగాడు కిరణ్ జార్జ్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో కిరణ్ 21-16, 21-17 తేడాతో టకుమా ఒబయాషి‌పై విజయం సాధించాడు. రెండో రౌండ్‌లో అతను 5వ సీడ్ లీ జీ జియా(మలేషియా)ను ఎదుర్కోనున్నాడు. మెన్స్ డబుల్స్‌లో సాయి ప్రతీక్-కృష్ణ ప్రసాద్, మిక్స్‌డ్ డబుల్స్‌లో సుమిత్ రెడ్డి-సిక్కీ రెడ్డి జంటలు రెండో రౌండ్‌కు చేరుకున్నాయి.

Next Story