Badminton : క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన సింధు.. రెండో రౌండ్‌లోనే శ్రీకాంత్ ఔట్

by Harish |

Badminton : క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన సింధు.. రెండో రౌండ్‌లోనే శ్రీకాంత్ ఔట్
X

దిశ, స్పోర్ట్స్ : థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో సింధు.. డెన్మార్క్ షట్లర్ అమాలీ షుల్ట్‌ను ఓడించింది. కేవలం 28 నిమిషాల్లోనే ప్రత్యర్థి భరతం పట్టింది. వరుసగా 21-13, 21-15 తేడాతో విజయం సాధించింది. అయితే, క్వార్టర్స్‌లో ఆమె కఠిన సవాల్ ఎదురైంది. వరల్డ్ నం.2 క్రీడాకారిణి అకానె యమగూచి(జపాన్)‌తో తలపడనుంది. ఇక మెన్స్ సింగిల్స్‌లో లక్ష్యసేన్ కూడా క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. రెండో రౌండ్‌లో అతను చైనాకు చెందిన జు జువాన్ చెన్‌పై 21-12, 21-13 తేడాతో నెగ్గాడు. స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన సేన్ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా ఏకపక్షంగా మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.

మరో స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ రెండో రౌండ్‌లోనే ఇంటిదారిపట్టాడు. చైనీస్ తైపీ ఆటగాడు సు లి యాంగ్ చేతిలో 16-21, 21-11, 18-21 తేడాతో ఓడిపోయాడు. గంటా 10 నిమిషాలపాటు సుదీర్ఘ సాగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ తీవ్రంగానే పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. మరోవైపు, పురుషుల డబుల్స్ విభాగంలో భారత స్టార్ ప్లేయర్లు సాత్విక్‌ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి కూడా ముందంజ వేశారు. రెండో రౌండ్‌లో సాత్విక్ జోడీ 21-12, 21-19 తేడాతో మలేసియాకు చెందిన బ్రయాన్ జెరెమీ-ముహమ్మద్ హైకల్ జంటపై విజయం సాధించింది. క్వార్టర్స్‌లో భారత జంట.. జపాన్‌కు చెందిన తకుమి నోమురా-షిమోగామి ద్వయాన్ని ఎదుర్కోనుంది.


Next Story