సింధు, ప్రణయ్ ఓటమి.. బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్స్‌లో భారత్ పతక ఆశలు ఆవిరి

by Dishanational3 |
సింధు, ప్రణయ్ ఓటమి.. బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్స్‌లో భారత్ పతక ఆశలు ఆవిరి
X

దిశ, స్పోర్ట్స్ : చైనా వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్స్‌లో భారత షట్లర్లు నిరాశపరిచారు. తొలి రౌండ్‌లోనే కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ ఇంటిదారిపట్టగా.. గురువారం రెండో రౌండ్‌లో పీవీ సింధు, హెచ్‌ఎస్ ప్రణయ్ ఓటమితో భారత్ పతక ఆశలు ఆవిరయ్యాయి. దీంతో ఈ సారి పతకం లేకుండానే భారత్ టోర్నీని ముగించింది. ఉమెన్స్ సింగిల్స్‌ రెండో రౌండ్‌లో సింధు 18-21, 21-13, 17-21 తేడాతో 6వ సీడ్, చైనా షట్లర్ హన్ యూ చేతిలో ఓడిపోయింది. గంటా 9 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో మొదట సింధుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. పోరాడినా తొలి గేమ్‌ను దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత పుంజుకున్న ఆమె రెండో గేమ్‌ను సొంతం చేసుకుని పోటీలోకి వచ్చింది. కానీ, నువ్వానేనా అన్నట్టు సాగిన నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ప్రత్యర్థిని నిలువరించలేక గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ సమర్పించుకుంది.

పురుషుల సింగిల్స్‌లో స్టార్ ఆటగాడు హెచ్‌.ఎస్ ప్రణయ్ కూడా రెండో రౌండ్‌లోనే ఓడిపోయాడు. చైనీస్ తైపీ ప్లేయర్ లిన్ యున్ యి 21-18, 21-11 తేడాతో ప్రణయ్‌పై విజయం సాధించాడు. ఉమెన్స్ డబుల్స్ రెండో రౌండ్‌లో తనీషా క్రాస్టో-అశ్విని పొన్నప్ప జోడీ 17-21, 12-21 తేడాతో జపాన్‌కు చెందిన నమి మత్సుయమ-చిహారు షిడా చేతిలో ఓడి ఇంటిదారిపట్టింది. దీంతో రెండో రౌండ్‌లోనే భారత్ ప్రాతినిధ్యం ముగిసింది. గతేడాది పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్-చిరాగ్ శెట్టి స్వర్ణం సాధించిన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, గాయం కారణంగా వారు ఈ టోర్నీ నుంచి తప్పుకున్నారు.



Next Story

Most Viewed