క్వార్టర్స్‌కు సింధు.. శ్రీకాంత్‌కు ఓటమి

by Dishanational3 |
PV Sindhu enters into quarter finals in Malaysia Masters 2022
X

దిశ, స్పోర్ట్స్ : ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు సత్తాచాటుతున్నది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. గురువారం ఉమెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో సింధు 13-21, 21-10, 21-14 తేడాతో అమెరికా షట్లర్ బీవెన్ జాంగ్‌ను ఓడించింది. తొలి గేమ్ కోల్పోయిన సింధు.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. వరుసగా రెండు గేమ్‌లను నెగ్గి విజేతగా నిలిచింది. నేడు క్వార్టర్స్‌లో చైనా క్రీడాకారిణి చెన్ యుఫీతో తలపడనుంది. మరోవైపు, రెండో రౌండ్‌లో భారత స్టార్ ఆటగాడు, తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్‌కు పరాజయం ఎదురైంది. చైనా ప్లేయర్ లు గ్వాంగ్జు చేతిలో 19-21, 21-12, 22-20 తేడాతో శ్రీకాంత్ పోరాడి ఓడాడు. తొలి గేమ్ నెగ్గి శుభారంభం చేసిన శ్రీకాంత్.. మిగతా రెండు గేమ్‌లను కోల్పోయి టోర్నీ నుంచి నిష్ర్కమించాడు. ఉమెన్స్ డబుల్స్‌లో గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలీ జోడీ క్వార్టర్స్‌కు చేరుకుంది. రెండో రౌండ్‌లో గాయత్రి జోడీ 21-18, 21-13 తేడాతో జపాన్‌కు చెందిన యుకీ ఫుకుషిమా-సయకా హిరోటా జోడీపై విజయం సాధించింది.



Next Story

Most Viewed