తెలుగు టైటాన్స్‌ ఓటమిపరంపర.. పీకేఎల్‌లో 17వ పరాజయం

by Dishanational3 |
తెలుగు టైటాన్స్‌ ఓటమిపరంపర.. పీకేఎల్‌లో 17వ పరాజయం
X

దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్నా తెలుగు టైటాన్స్ ఆటతీరులో ఎలాంటి మార్పు లేదు. లీగ్‌లో ఆ జట్టు ఓటమిపరంపర కొనసాగుతోంది. తాజాగా టైటాన్స్ 17వ ఓటమిని చవిచూసింది. శనివారం కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ చేతిలో 55-35 తేడాతో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో టైటాన్స్ మొదటి నుంచి తడబడింది. రెండుసార్లు ఆలౌటైన ఆ జట్టు ఫస్టాఫ్‌లో 14-26తో వెనుకబడింది. సెకండాఫ్‌లోనూ బెంగాల్ వారియర్స్ జోరు కొనసాగింది. మరో రెండుసార్లు టైటాన్స్‌ను ఆలౌట్ చేసి పూర్తి పట్టు సాధించింది. అనంతరం టైటాన్స్ పుంజుకున్నప్పటికీ అప్పటికే ఆలస్యమైంది. దీంతో 20 పాయింట్ల తేడాతో టైటాన్స్ పరాజయం పాలైంది. నితిన్ కుమార్ 13 పాయింట్లతో బెంగాల్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు, తెలుగు టైటాన్స్ తరఫున మిలాద్(9 పాయింట్లు), ప్రఫుల్(8 పాయింట్లు), కెప్టెన్ పవన్(6 పాయింట్లు) పోరాడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. కాగా, టోర్నీలో తెలుగు టైటాన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ ఆశలు కోల్పోగా నామమాత్రపు మ్యాచ్‌లే ఆడుతోంది. ఈ నెల 13న పాట్నా పైరేట్స్‌తో తలపడనుంది. మరో మ్యాచ్‌లో పాట్నా పైరేట్స్ 44-23 తేడాతో యు ముంబాపై విజయం సాధించింది. దీంతో పాయింట్స్ టేబుల్‌లో 4వ స్థానానికి చేరుకున్న పాట్నా పైరేట్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌కు అడుగు దూరంలో నిలిచింది.


Next Story