Champions Trophy : భారీగా పెరిగిన చాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్‌మనీ.. విజేతకు ఎంత దక్కుతుందో తెలుసా?

by Harish |

మరో ఐదు రోజుల్లో చాంపియన్స్ ట్రోఫీకి తెరలేవనుంది. ఈ నెల 19 నుంచి ఐసీసీ టోర్నీ ప్రారంభంకానుంది.

Champions Trophy : భారీగా పెరిగిన చాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్‌మనీ.. విజేతకు ఎంత దక్కుతుందో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : మరో ఐదు రోజుల్లో చాంపియన్స్ ట్రోఫీకి తెరలేవనుంది. ఈ నెల 19 నుంచి ఐసీసీ టోర్నీ ప్రారంభంకానుంది. ఈ టోర్నీకి సంబంధించిన ప్రైజ్‌మనీని శుక్రవారం ఐసీసీ ప్రకటించింది. మొత్తం ప్రైజ్‌మనీ కోసం రికార్డు స్థాయిలో దాదాపు రూ.60 కోట్లు వెచ్చించనుంది. చివరిసారిగా 2017లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీతో పోలిస్తే ఇది 53 శాతం ఎక్కువ. ఆ టోర్నీ నగదు బహుమతి దాదాపు రూ.40 కోట్లు. ఈ సారి సుమారు రూ.20 కోట్లు పెంచడం గమనార్హం.

ఇక, విజేతగా నిలిచిన జట్టుకు భారీ మొత్తం దక్కనుంది. సుమారు రూ.20 కోట్లు ప్రైజ్‌మనీ పొందనుంది. గత టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన పాక్‌కు నగదు బహుమతిగా రూ.14.18 కోట్లు దక్కాయి. రన్నరప్‌గా నిలిచిన భారత్‌కు రూ. 7 కోట్లు దక్కగా.. ఈ సారి రన్నరప్‌కు ఐసీసీ రూ.9.72 కోట్లు ఇవ్వనుంది. అలాగే, సెమీ ఫైనలిస్ట్‌లు రూ.4.86 కోట్లు తీసుకెళ్లనున్నాయి. 6వ స్థానంలో నిలిచిన జట్టు రూ.3.04 కోట్లు, 7వ, 8వ స్థానాల్లో నిలిచిన టీమ్‌లు రూ.1.21 కోట్లు అందనున్నాయి.

అలాగే, ప్రతి గ్రూపు మ్యాచ్ విజయానికి ఐసీసీ రూ.29 లక్షలు అదనంగా ఇవ్వనుంది. టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టు కచ్చితంగా సుమారు రూ.1.08 కోట్లు పొందడం ఖాయమని ఐసీసీ తెలిపింది. భారీగా ప్రై‌జ్‌మనీ పెంపు అనేది క్రీడలో పెట్టుబడులు పెట్టడం, మా ఈవెంట్‌ల ప్రపంచ ప్రతిష్టను కొనసాగించడంపై ఐసీసీకి ఉన్న నిబద్ధతను నొక్కి చెబుతుందని ఐసీసీ చైర్మన్ జై షా పేర్కొన్నారు. చాంపియన్స్ ట్రోఫీలో తీవ్రమైన పోటీ రేకెత్తిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఆకట్టుకుంటుందని తెలిపారు.


Next Story