PKL 2025 : ఎట్టకేలకే బోణీ కొట్టిన తెలుగు టైటాన్స్.. జైపూర్‌పై విజయం

by Harish |

ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది.

PKL 2025 : ఎట్టకేలకే బోణీ కొట్టిన తెలుగు టైటాన్స్.. జైపూర్‌పై విజయం
X

దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఈ సీజన్‌లో ఆరంభంలోనే షాక్‌లు తిన్న ఆ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. మూడో మ్యాచ్‌తో టోర్నీలో గెలుపు ఖాతా తెరిచింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్‌పై 37-32 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో మొదట టైటాన్స్ ఆధిపత్యం ప్రదర్శించింది. భరత్, కెప్టెన్ విజయ్ మాలిక్‌తోపాటు చేతన్ సాహు, అవి దుహాన్‌లను సత్తాచాటారు. దీంతో ఫస్టాఫ్‌లో టైటాన్స్ 16-9తో ఆధిక్యంలో నిలిచింది.

అయితే, సెకండాఫ్‌లో జైపూర్ కూడా బలంగా పుంజుకుంది. వరుసగా పాయింట్స్ సాధించింది. టైటాన్స్ కూడా ఏం వెనక్కి తగ్గలేదు. ఇరు జట్లు పోటాపోటీగా పాయింట్స్ సాధిస్తుండటంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. కానీ, జైపూర్‌ను టైటాన్స్ నిలువరించింది. కెప్టెన్ విజయ్ మాలిక్, భరత్ చెరో 8పాయింట్లతో టైటాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించగా.. చేతన్, అవి కూడా రాణించారు. ఇక, జైపూర్ జట్టులో నితిన్ కుమార్(13 పాయింట్స్) ఒంటరి పోరాటం వృథా అయ్యింది. మరోవైపు, పుణేరి పల్టాన్స్ జోరుకు దబాంగ్ ఢిల్లీ కే.సీ బ్రేక్ వేసింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 28(0)-28(2) గోల్డెన్ రైడ్ ద్వారా ఢిల్లీ విజయం సాధించింది. ముందుగా నిర్ణీత సమయంలో ఇరు జట్లు 28-28తో సమంగా నిలిచింది. దీంతో మ్యాచ్ టై బ్రేకర్‌కు వెళ్లింది. అక్కడ గోల్డెన్ రైడ్ చేసిన అషు బోనస్‌తోపాటు ఒక్క పాయింట్ మొత్తంగా రెండు పాయింట్లు తేవడంతో ఢిల్లీ విజయం లాంఛనమైంది.


Next Story