PKL 2025 : తెలుగు టైటాన్స్‌కు మళ్లీ షాక్..

by Harish |

ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్‌కు మళ్లీ షాక్ తగిలింది.

PKL 2025 : తెలుగు టైటాన్స్‌కు మళ్లీ షాక్..
X

దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్‌కు మళ్లీ షాక్ తగిలింది. ఓటమితో టోర్నీని ఆరంభించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధాస్ 40-35 తేడాతో టైటాన్స్‌పై విజయం సాధించింది. ఓపెనింగ్ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా యూపీ‌తో మ్యాచ్‌లో ఫస్టాఫ్‌లోనే టైటాన్స్ పట్టు కోల్పోయింది. భారీగా పాయింట్స్ సమర్పించుకుంది. ఫస్టాఫ్‌ ముగిసే సమయానికి టైటాన్స్ 21-13 తేడాతో వెనుకబడింది. అయితే, సెకండాఫ్‌లో పుంజుకుంది. దూకుడు పెంచిన ఆ జట్టు ఆటగాళ్లు వరుసగా రైడ్, టాకిల్ పాయింట్స్ తెచ్చారు. మరోవైపు యూపీ కూడా తగ్గలేదు. కానీ, సెకండాఫ్‌లో టైటాన్స్‌దే పైచేయి. ఆ జట్టు 22పాయింట్స్ గెలవగా.. యూపీ 19 పాయింట్లు సాధించింది. కానీ, యూపీ ఆధిక్యాన్ని మాత్రం అధిగమించలేకపోవడంతో టైటాన్స్‌కు ఓటమి తప్పలేదు. కెప్టెన్ విజయ్ మాలిక్ 14 పాయింట్లతో చేసిన ఒంటరి పోరాటం జట్టును గెలిపించలేకపోయింది. మరోవైపు, యూపీ తరపున గంగన్ గౌడ(14 పాయింట్స్) సత్తాచాటగా.. సుమిత్(8 పాయింట్స్), గుమన్ సింగ్(7 పాయింట్స్)తో రాణించారు. అలాగే, గుజరాత్ జెయింట్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో యు ముంబా టై బ్రేకర్‌లో గెలిచింది. ముందుగా ఇరు జట్లు 29-29తో సమంగా నిలిచాయి. దీంతో మ్యాచ్ టై బ్రేకర్‌గా వెళ్లగా అక్కడ యు ముంబా 6-5తో విజయం సాధించింది.


Next Story