వరల్డ్ కప్‌లో పాల్గొంటాం కానీ.. సంచలన నిర్ణయం తీసుకున్న పాకిస్తాన్

by Harish |

వరల్డ్ కప్‌లో పాల్గొంటాం కానీ.. సంచలన నిర్ణయం తీసుకున్న పాకిస్తాన్
X

దిశ, స్పోర్ట్స్ : భారత్‌లో టీ20 ప్రపంచకప్‌ ఆడటానికి నిరాకరించిన బంగ్లాదేశ్‌‌ను ఐసీసీ వరల్డ్ కప్ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో బంగ్లాకు అన్యాయం జరిగిందని పాకిస్తాన్ వాదిస్తోంది. దీంతో పాక్ కూడా వరల్డ్ కప్‌ను బాయ్‌కాట్ చేస్తుందని లేదంటే భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తుందన్న వార్తలు వచ్చాయి. తాజాగా పాక్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వరల్డ్ కప్‌లో పాల్గొంటాం కానీ భారత్‌తో ఆడమని సంచలన నిర్ణయం తీసుకుంది. ఆదివారం పాక్ ప్రధాని షెహబాజ్ షరిఫ్‌తో పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీ సమావేశం అయ్యారు. మీటింగ్ అనంతరం పాక్ ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. ‘టీ20 వరల్డ్ కప్-2026లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పాల్గొనడానికి పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ, భారత్‌తో మ్యాచ్‌లో మాత్రం పాక్ జట్టు మైదానంలోకి దిగదు.’అని వెల్లడించింది. పాక్ తమ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్‌, పాక్ మ్యాచ్ జరగనుంది.

ఐసీసీ ఏం చేయబోతుంది?

భారత్‌తో ఆడొద్దని పాక్ తీసుకున్న నిర్ణయం కచ్చితంగా టోర్నీ నిబంధనలను ఊల్లంఘించడమే. గతేడాది పాక్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ సమయంలో బీసీసీఐ, పీసీబీ మధ్య ఓ ఒప్పందం జరిగింది. భారత్‌లో లేదా పాక్‌లో జరిగే ఐసీసీ ఈవెంట్లలో తమ మ్యాచ్‌లను తటస్థ వేదికపై ఆడతామని నిర్ణయించాయి. చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు దుబాయ్‌లో ఆడిన విషయం తెలిసిందే. అలాగే టీ20 ప్రపంచకప్‌లో పాక్ మ్యాచ్‌లను శ్రీలంకలో షెడ్యూల్ చేశారు. ఇప్పుడు భారత్‌తో మ్యాచ్‌ను పాక్ బాయ్‌కాట్ చేయడం ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ఈ నేపథ్యంలో పాక్‌పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పాక్‌ మ్యాచ్‌ను బహిష్కరిస్తే భారత్‌కు ఆటోమేటిక్‌గా రెండు పాయింట్స్ వస్తాయి.


Next Story