ఢిల్లీలో గల్లీ క్రికెట్ ఆడిన న్యూజీలాండ్ ప్రధాని

by Ajay Maddhiboyina |

ఇండియా పర్యటనలో ఉన్న కివీస్ ప్రధాని లక్సన్ గత వారం ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిశారు.

ఢిల్లీలో గల్లీ క్రికెట్ ఆడిన న్యూజీలాండ్ ప్రధాని
X

- లెజెండరీ క్రికెటర్ కపిల్ కూడా..

- పిల్లలతో ఆడిన రాస్ టేలర్, అజాజ్ పటేల్

దిశ, స్పోర్ట్స్: న్యూజీలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్ ఢిల్లీ వీధుల్లో సందడి చేశారు. లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్‌, కివీస్ క్రికెటర్లు అజాజ్ పటేల్, రాస్ టేలర్‌తో కలిసి గల్లీ క్రికెట్ ఆడారు. రాజధాని నగర వీధుల్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పిల్లలతో వీరిందరూ కలిసి క్రికెట్ ఆడి కనువిందు చేశారు. క్రికెట్‌ను ఎక్కువగా ప్రేమించే కివీస్ పీఎం క్రిస్టఫర్ లక్సన్.. తన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. పీఎం లక్సన్ కొన్ని షాట్లను కొట్టడంతో పాటు మంచి ఫీల్డింగ్ కూడా చేశారు. మైదానంలో ప్రొఫెషనల్స్ ఆడేలా తన బ్యాటింగ్‌ను ప్రదర్శించారు. ఫీల్డింగ్ చేసే సమయంలో కూడా అజాజ్ పటేల్ ఇచ్చిన క్యాచ్‌ను చాకచక్యంగా పట్టుకున్నారు. 'ఢిల్లీ వీధుల్లో కపిల్ దేవ్‌తో కలసి కొంత మంది అద్భుతమైన పిల్లలతో క్రికెట్ ఆడుతున్నాను. ఇది నాకు నమ్మశక్యంగా లేదు' అని లక్సన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు. కాగా, నేను లెగ్ సైడ్ వైపు ఆడాను. అయితే పీఎం అక్కడ ఉన్నారని మర్చిపోయాను. కానీ ఆయన అద్భుతంగా క్యాచ్ పట్టారని అజాజ్ పటేల్ అన్నాడు. అవును.. ఇది తప్పకుండా మంచి క్యాచ్ అని రాస్ టేలర్ కూడా పొగిడారు.

ఇండియా పర్యటనలో ఉన్న కివీస్ ప్రధాని లక్సన్ గత వారం ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిశారు. భారత్ చేతిలో న్యూజీలాండ్ చాంపియన్స్ ట్రోఫీలో ఓడిపోయిన విషయాన్ని మోడీ వద్ద ప్రస్తావించలేదు. అలాగే ఇండియాలో కివీస్ టెస్ట్ సిరీస్ విజయాన్ని కూడా మాట్లాడలేదు. ఆ విధంగా మా దౌత్య సంబంధాల్లో విభేదాలు రాకుండా చూసుకున్నామని లక్సన్ చమత్కరించారు. భారత్, న్యూజీలాండ్‌ను దగ్గర చేయడంలో క్రికెట్‌కు మించింది మరొకటి లేదని ఆయన ఎక్స్‌లో రాసుకొచ్చారు.

Next Story