ఏకైక టెస్ట్ బంగ్లాదే.. ఐర్లాండ్‌పై సునాయాస విజయం

by Disha Web Desk 13 |
ఏకైక టెస్ట్ బంగ్లాదే.. ఐర్లాండ్‌పై సునాయాస విజయం
X

ఢాకా: ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టు ఆతిథ్య బంగ్లాదేశ్ సొంతమైంది. ఐర్లాండ్ నిర్దేశించిన 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లా జట్టు 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆతిథ్య జట్టు మరో రోజు మిగిలి ఉండగానే టెస్టును దక్కించుకుంది. 286/8 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం ఆట కొనసాగించిన ఐర్లాండ్ కాసేపటికే ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్ ఆండ్రీ మెక్‌బ్రైన్(72)‌, హుమే(14) స్వల్ప వ్యవధిలోనే వికెట్లు కోల్పోవడంతో ఐర్లాండ్ 292 పరుగులకు ఆలౌటైంది.

అయితే, టక్కర్(108), ఆండీ మెక్‌బ్రైన్(72), టెక్టర్(56) పోరాటంతో ఇన్నింగ్స్ ఓటమి నుంచి బయటపడిన ఆ జట్టు.. బంగ్లా ముందు 138 పరుగుల ఈజీ టార్గెట్ పెట్టింది. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ 4, హుస్సేన్ 3 వికెట్లతో సత్తాచాటగా.. షకీబ్ 2, షారిఫుల్ ఇస్లాం ఒక వికెట్ తీసుకున్నారు. స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 27.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లిటాన్ దాస్(23), శాంటో(4) త్వరగానే అవుటైనా.. తమీమ్ ఇక్బాల్(31)‌‌తో కలిసి ముష్ఫికర్ రహీమ్(51 నాటౌట్) దూకుడు ఇన్నింగ్స్‌తో జట్టును విజయం దిశగా తీసుకెళ్లాడు.

ఈ క్రమంలో ఇక్బామ్ అవుటైనా.. మోమినుల్ హక్(20 నాటౌట్)తో కలిసి రహీమ్ జట్టును గెలిపించాడు. ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 214 పరుగులు చేయగా.. బంగ్లా 369 పరుగులు చేసి 155 పరుగుల ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే. బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించిన ముష్ఫికర్ రహీమ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. దాంతో ఐర్లాండ్‌పై వన్డే, టీ20 సిరీస్‌లను గెలుచుకున్న బంగ్లా ఖాతాలో టెస్టు మ్యాచ్‌ కూడా చేరింది.

Next Story