సచిన్ ముందే ఆ పని చేసిన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు

by Dishanational3 |
సచిన్ ముందే ఆ పని చేసిన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఇటీవలే ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఆ సిరీస్‌లో అతను అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతని తమ్ముడు ముషీర్ ఖాన్ కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. అండర్-19 వరల్డ్ కప్‌లో అతను మెరుపులు మెరిపించాడు. దీంతో క్రికెట్ వర్గాల్లో అన్నదమ్ముల గురించి చర్చ జరిగింది. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలోనూ అతను అదరగొడుతున్నాడు. తాజాగా విదర్భతో జరుగుతున్న ఫైనల్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డునే బద్దలు కొట్టాడు.

విదర్భ, ముంబై జట్ల మధ్య రంజీ ట్రోఫీ ఫైనల్ జరుగుతుంది. ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న ముషీర్ ఖాన్ తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపర్చినప్పటికీ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సెంచరీతో కదం తొక్కాడు. క్రీజులో పాతుకపోయిన అతను 326 బంతుల్లో 136 పరుగులు చేశాడు. ముషీర్ ఖాన్ సెంచరీతో ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 418 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో విదర్భ ముందు 538 పరుగుల టార్గెట్ పెట్టిన ముంబై విజయంపై కన్నేసింది.

ముషీర్ ఖాన్ సెంచరీ సాధించడం ద్వారా సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. రంజీ ట్రోఫీ ఫైనల్‌లో శతకం బాదిన అతిపిన్న వయస్కుడిగా రికార్డుకెక్కాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. 1994-95 సీజన్‌లో ముంబై తరపున 21 ఏళ్ల వయసులో సచిన్ పంజాబ్‌పై సెంచరీ కొట్టాడు. తాజాగా 19 ఏళ్ల ముషీర్ 29 ఏళ్ల ఈ రికార్డును అధిగమించాడు.

మరో విశేషం ఏంటంటే.. ఈ మ్యాచ్‌కు మంగళవారం సచిన్ హాజరయ్యాడు. సచిన్ ముందు అతని రికార్డును అధిగమించడం ముషీర్ ఖాన్‌కు ప్రత్యేకంగా నిలువనుంది. మ్యాచ్ అనంతరం ముషీర్ ఖాన్ మాట్లాడుతూ..‘మొదట సచిన్ సర్‌ను నేను చూడలేదు. 60 పరుగుల వద్ద బిగ్ స్ర్కీన్‌పై చూశాను. సచిన్ సర్‌ను ఇంప్రెస్ చేయాలనే ప్రేరణతోనే నేను బ్యాటింగ్ చేశాను.’ అని చెప్పుకొచ్చాడు.



Next Story

Most Viewed