WPL 2025 : ఫైనల్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఎలిమినేటర్‌లో గుజరాత్ చిత్తు

by Harish |

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ మరోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

WPL 2025 : ఫైనల్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఎలిమినేటర్‌లో గుజరాత్ చిత్తు
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ మరోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆరంభ సీజన్‌లో చాంపియన్‌గా నిలిచిన ఆ జట్టు.. ఎలిమినేటర్‌లో గుజరాత్ జెయింట్స్‌ను ఇంటికి పంపించి టైటిల్‌కు చేరువైంది. శనివారం జరిగే టైటిల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టనుంది. ముంబై వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌పై 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. హేలీ మాథ్యూస్(77, 3/31) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించింది. మాథ్యూస్‌తోపాటు స్కివర్(77) రాణించడంతోపాటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(36) మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఛేదనలో గుజరాత్ 19.2 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. డేనియల్ గిబ్సన్(34), లిచ్‌ఫీల్డ్(31), భారతి(30) మాత్రమే పర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థిని నిలువరించారు.

గుజరాత్ విలవిల

ఛేదనలో ముంబై బౌలర్ల ధాటికి గుజరాత్ విలవిలలాడిపోయింది. బెత్ మూనీ(6), హర్లీన్ డియోల్(8), కెప్టెన్ గార్డ్‌నెర(8) నిరాశపర్చడంతో 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడంతో పవర్ ప్లేలోనే ఆ జట్టుకు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ తర్వాత డేనియల్ గిబ్సన్(3), లిచ్‌ఫీల్డ్(31), భారత ఫుల్మాలి(30) కాసేపు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ, ఒత్తిడిలో వికెట్లు పారేసుకున్నారు. సిమ్రాన్ షేక్(17), తనూజ(16), మేఘ్న సింగ్(5) కూడా వికెట్లు కోల్పోవడంతో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ ఆలౌటైంది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో నలుగురు రనౌటవ్వడం గమనార్హం. ముంబై బౌలర్లలో హేలీ 3 వికెట్లు, అమేలియా కెర్ రెండు వికెట్లతో రాణించారు.

చెలరేగిన హేలీ, స్కివర్

అంతకుముందు ముంబై ఇన్నింగ్స్‌లో హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్ బ్రంట్ చెలరేగారు. ఓపెనర్ యాస్తికా భాటియా(15) త్వరగానే అవుటవడంతో మొదట ముంబైకి శుభారంభం దక్కలేదు. అయితే, క్రీజులోకి వచ్చిన స్కివర్.. మరో ఓపెనర్ హేలీ మాథ్యూస్ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. స్కివర్ 41 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 77 రన్స్ చేసింది. మరోవైపు, హేలీ 50 బంతుల్లో 77 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. ఈ జోడీ రెండో వికెట్‌కు 133 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి ముంబై భారీ స్కోరు కారణమయ్యారు. హేలీ అవుటైన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఆఖరి మూడు ఓవర్లలో సిక్స్‌లు, ఫోర్లతో దంచికొట్టింది. 12 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 36 రన్స్ చేసిన హర్మన్.. చివరి బంతికి రనౌటైంది. ఆమె చివరి మూడు ఓవర్లలో 47 పరుగులు రాబట్టడంతో ముంబై స్కోరు 200 దాటింది.

Next Story