మలేసియా మాస్టర్స్: క్వార్టర్ ఫైనల్స్‌‌లో పీవీ సింధు, శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

by Disha Web Desk 13 |
మలేసియా మాస్టర్స్: క్వార్టర్ ఫైనల్స్‌‌లో పీవీ సింధు, శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..
X

కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్‌ఎస్ ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. గురువారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్‌ రెండో రౌండ్‌లో సింధు 21-16, 21-11 తేడాతో జపాన్ క్రీడాకారిణి అయా ఒహోరిని చిత్తు చేసింది. మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు 40 నిమిషాల్లోనే జపాన్ క్రీడాకారిణి ఆట కట్టించింది. క్వార్టర్స్‌లో చైనా క్రీడాకారిణి యి మాన్ జాంగ్‌తో తలపడనుంది. మెన్స్ సింగిల్స్‌లో తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్ 8వ సీడ్‌కు షాకిచ్చాడు. థాయిలాండ్ ఆటగాడు కున్లవుట్ విటిడ్సార్న్‌‌పై 21-19, 21-19 తేడాతో సంచలన విజయం సాధించాడు. రెండు గేమ్స్‌లోనూ థాయిలాండ్ ప్లేయర్ ఆధిపత్యమే కొనసాగినా.. కీలక సమయాల్లో శ్రీకాంత్ పుంజుకోవడంతో మ్యాచ్ దక్కింది.

తొలి గేమ్‌లో 18వ పాయింట్ వరకూ ప్రత్యర్థితే ఆట. 0-5 తేడాతో వెనుకబడిన శ్రీకాంత్ ఒక్కో పాయింట్‌తో ప్రత్యర్థికి చేరువై 19-19తో స్కోరును సమం చేసి అదే పట్టుదలతో గేమ్‌ను గెలుచుకున్నాడు. ఇక, రెండో గేమ్‌లో ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగింది. ఈ క్రమంలో 18-13 తేడాతో శ్రీకాంత్ గేమ్‌ కోల్పోయేలా కనిపించాడు. కానీ, వరుసగా 4 పాయింట్లను సాధించి పోటీలోకి వచ్చిన అతను రెండో గేమ్‌ను కూడా సాధించి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. మరో మ్యాచ్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ 13-21, 21-16, 21-11 తేడాతో చైనా ఆటగాడు లి షి ఫెంగ్‌పై నెగ్గి టోర్నీలో ముందడుగు వేశాడు. మరో భారత స్టార్ ఆటగాడు లక్ష్యసేన్ 14-21, 19-21 తేడాతో హాంకాంగ్‌కు చెందిన అంగస్‌ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించాడు.


Next Story