బాక్సింగ్‌కు మేరీ కోమ్ వీడ్కోలు.. ఇంకా ఆడాలని ఉంది కానీ..

by Dishanational5 |
బాక్సింగ్‌కు మేరీ కోమ్ వీడ్కోలు.. ఇంకా ఆడాలని ఉంది కానీ..
X

దిశ, స్పోర్ట్స్: ఆరుసార్లు వరల్డ్ చాంపియన్, 2012లో ఒలింపిక్ పతక విజేత లెజెండరీ బాక్సర్ మేరీ కోమ్ బాక్సింగ్‌కు వీడ్కోలు పలికింది. 41ఏళ్ల మేరీకోమ్.. వయోపరిమితిని కారణంగా పేర్కొంటూ క్రీడల నుంచి వైదొలుగుతున్నట్టు మంగళవారం రాత్రి ప్రకటించింది. ‘‘నాకు ఇంకా ఆడాలని ఉంది. కానీ, దురదృష్టవశాత్తూ వయోపరిమితి ముగిసినందున నేను ఏ పోటీలోనూ పాల్గొనలేను. కాబట్టి, ఆట నుంచి బలవంతంగా నిష్క్రమించాల్సి వస్తోంది’’ అని ఓ కార్యక్రమంలో వెల్లడించింది. మేరీ కోమ్ 2012లో లండన్ ఒలింపిక్స్‌లో 51 కేజీల విభాగంలో కాంస్యం సాధించి, మహిళల బాక్సింగ్‌లో ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ బాక్సర్‌గా నిలిచింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన మేరీ కోమ్.. 2021లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో రజతం గెలుచుకుంది. మేరీ 8 ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాలు, 7 ఆసియా చాంపియన్‌షిప్ పతకాలు, 2ఆసియా క్రీడల పతకాలు, ఒక కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతకం సాధించింది. క్రీడల్లో దేశఖ్యాతి పెంచడమేగాక, ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన మేరీ కోమ్‌కు భారత ప్రభుత్వం.. 2020లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌తో సత్కరించింది. 2016 నుంచి 2022 వరకు రాజ్యసభ సభ్యురాలిగానూ వ్యవహరించారు. కాగా, అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్(ఐబీఏ) నిబంధనల ప్రకారం, పురుష, మహిళా బాక్సర్లను 40ఏళ్ల వరకు మాత్రమే ‘ఎలైట్ లెవెల్’లో పోటీ పడేందుకు అనుమతిస్తారు.



Next Story