LA28 Olympics : భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్

by Harish |   (  Updated:2025-07-17 16:39:19  IST  )

లాస్ ఏంజిల్ ఒలింపిక్స్-2028లో క్రికెట్ మ్యాచ్‌లు భారత్‌లో చూసే వీలుగా నిర్వహించనున్నారు.

LA28 Olympics : భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్
X

దిశ, స్పోర్ట్స్ : భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. లాస్ ఏంజిల్ ఒలింపిక్స్-2028లో క్రికెట్ మ్యాచ్‌లు భారత్‌లో చూసే వీలుగా నిర్వహించనున్నారు. 128 ఏళ్ల తర్వాత క్రికెట్ లాస్ ఏంజిల్ ఒలింపిక్స్‌లో పునరాగమనం చేయబోతుంది. 2028 జూలై 12 నుంచి పురుషుల, మహిళల క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయని ఒలింపిక్స్ నిర్వాహకులు ఇప్పటికే తెలిపారు. కాలిఫోర్నియాలోని పోమోనాలో కొత్తగా నిర్మించిన ఫెయిర్‌గ్రౌండ్స్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్‌లు జరగనున్నట్టు చెప్పారు. కాలిఫోర్నియా సమయానికి భారత కాలమానానికి 12 గంటల వ్యత్యాసం ఉంటుంది. అయితే, భారత ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని క్రికెట్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను రూపొందించనున్నట్టు తెలుస్తోంది.

ఒలింపిక్స్‌లోకి తిరిగి క్రికెట్‌ను చేర్చే ప్రక్రియతో సంబంధం ఉన్న కిట్ ‌మెక్‌కానెల్.. భారత్‌‌లో క్రికెట్ మార్కెట్‌ను దృష్టి పెట్టుకుని ప్రారంభ సమయాలను నిర్ణయించినట్టు చెప్పారు. భారత కాలమానం ప్రకారం.. ఉదయం 7 గంటలకు, రాత్రి 9:30 గంటలకు మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. ఇంకా క్రికెట్ షెడ్యూల్‌ ఖరారు కాలేదు. సింగపూర్‌లో జరుగుతున్న ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో షెడ్యూల్‌ను ఖరారు చేసే చాన్స్ ఉంది. పురుషుల, మహిళల విభాగాల్లో ఆరు జట్ల చొప్పున పాల్గొంటాయి. ఆరు జట్లను మూడు టీమ్‌ల చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. గ్రూపులో ఉన్న ప్రతి జట్టు ఇతర రెండు జట్లతో చెరో మ్యాచ్ ఆడుతుంది. అలాగే, ఇతర గ్రూపులోని రెండు జట్లతోనూ తలపడుతుంది. టాప్-2 జట్లు గోల్డ్ మెడల్ మ్యాచ్, 3, 4 స్థానాల్లో నిలిచిన జట్టు బ్రాంజ్ మెడల్ మ్యాచ్ ఆడతాయి. అయితే, జట్ల క్వాలిఫికేషన్ ప్రక్రియపై ఇంకా స్పష్టత రాలేదు.

Next Story