కేఎల్ రాహుల్‌‌కు తొలి టెస్టులో చోటు దక్కేనా?

by Dishanational3 |
కేఎల్ రాహుల్‌‌కు తొలి టెస్టులో చోటు దక్కేనా?
X

దిశ, స్పోర్ట్స్ : ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌ను ముగించుకున్న టీమ్ ఇండియా.. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌పై ఫోకస్ పెట్టింది. ఈ నెల 25 నుంచి 29 మధ్య హైదరాబాద్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. అయితే, తుది జట్టు ఎంపిక హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్‌కు తలనొప్పిగా మారనుంది. ముఖ్యంగా జట్టులో కేఎల్ రాహుల్‌ పాత్రపై పలు అనుమానాలు నెలకొన్నాయి. అతన్ని వికెట్ కీపర్, బ్యాటర్‌గా తీసుకోవాలా? లేదా కేవలం బ్యాటర్‌కే పరిమితం చేయాలా? అనేది టీమ్ మేనేజ్‌మెంట్‌కు సవాల్‌గా మారింది. అతని వికెట్ కీపింగ్‌పై టీమ్ మేనేజ్‌మెంట్ సంతృప్తిగా లేకపోవడమే అందుకు కారణమని తెలుస్తోంది.

తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ వైపు మొగ్గు?

సౌతాఫ్రికాతో సిరీస్‌లో కేఎల్ రాహుల్ టెస్టుల్లో వికెట్‌ కీపర్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టాడు. అయితే, అతను వికెట్ల వెనకాల అంచనాల మేరకు రాణించలేదని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు, భారత్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయన్న విషయం తెలిసిందే. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై రాహుల్ ఏ మేరకు రాణిస్తాడన్నది టీమ్ మేనేజ్‌మెంట్‌కు పెద్ద ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో రాహుల్ కంటే తెలుగు కుర్రాడు, వికెట్ కీపర్ కేఎస్ భరత్‌ వైపు టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడిన తర్వాత కేఎస్ భరత్ టెస్టుల్లో టీమ్ ఇండియాకు వికెట్ కీపర్‌గా వ్యవహరించాడు. గతేడాది సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌తోపాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లోనూ కీపర్‌గా ఉన్నాడు. వెస్టిండీస్‌తో సిరీస్‌కు అతన్ని పక్కనపెట్టడంతో జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో అతనికి తిరిగి చోటు దక్కింది. అయితే, కేఎల్ రాహుల్‌కు చోటును కూడా కొట్టిపారేయలేం. అతనికి మరో అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావించొచ్చు.

ఐదో స్థానం కోసం రాహుల్, అయ్యర్ మధ్య పోటీ

ఒకవేళ వికెట్ కీపర్‌గా కేఎస్ భరత్‌ను తీసుకుంటే బ్యాటర్‌గానైనా కేఎల్ రాహుల్‌కు చోటు దక్కుతుందా? అన్న అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే.. ఐదో స్థానం కోసం కేఎల్ రాహుల్‌తోపాటు శ్రేయస్ అయ్యర్ పోటీపడుతున్నాడు. జట్టులో కీలకమైన వీరిద్దరిలో ఒకరిని ఎంపిక చేయడం టీమ్ మేనేజ్‌మెంట్‌కు సవాల్‌తో కూడుకున్నదే. సౌతాఫ్రికాతో సిరీస్‌లో వీరిద్దరూ తుది జట్టులో ఉన్నారు. కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా వ్యవహరించడంతో ఐదో స్థానంలో అయ్యర్‌కు చోటు దక్కింది. అయితే, అయ్యర్‌తో పోలిస్తే రాహుల్‌కే ఎక్కువ అవకాశం ఉంది. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో కీలక వికెట్లు పడిన సమయంలో సెంచరీతో అతను చేసిన అసాధారణ పోరాటాన్ని ఇప్పట్లో మరవలేం. కాబట్టి, జట్టులో బ్యాటర్‌గా అతని పాత్ర కీలకమే. మరోవైపు, అయ్యర్ సఫారీలతో రెండు టెస్టుల్లోనూ అంచనాలను అందుకోలేకపోయాడు. సొంతగడ్డపై కేఎల్ రాహుల్ 25 ఇన్నింగ్స్‌ల్లో 40.13 సగటుతో 923 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ 11 ఇన్నింగ్స్‌ల్లో 39.09 సగటుతో 430 పరుగులు చేశాడు. ఒకవేళ, కేఎస్ భరత్‌ను కాదని వికెట్ కీపర్‌గా రాహుల్‌ను తీసుకుంటే.. రాహుల్‌తోపాటు అయ్యర్‌ కూడా తుది జట్టులో అవకాశం దక్కుతుంది. మరి, టీమ్ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే తొలి టెస్టు వరకు వేచి చూడాల్సిందే.


Next Story

Most Viewed