హ్యాట్రిక్ కొట్టిన భారత్.. హాకీ వరల్డ్ కప్‌లో క్వార్టర్స్‌‌కు

by Harish |

పురుషుల జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో భారత జట్టు అదరగొడుతోంది.

హ్యాట్రిక్ కొట్టిన భారత్.. హాకీ వరల్డ్ కప్‌లో క్వార్టర్స్‌‌కు
X

దిశ, స్పోర్ట్స్ : పురుషుల జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో భారత జట్టు అదరగొడుతోంది. ఏకపక్ష విజయాలతో దూకుడు మీద ఉన్న భారత్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. అంతేకాకుండా, క్వార్టర్ ఫైనల్స్‌‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన చివరి గ్రూపు మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌పై 5-0 తేడాతో గెలిచింది. గత మ్యాచ్‌ల్లో చిలీ, ఒమన్‌పై గెలిచిన విషయం తెలిసిందే. స్విట్జర్లాండ్‌పై కూడా భారత్ అదే జోరు కొనసాగించింది. మన్‌మీత్, శారదానంద్ చెరో రెండు గోల్స్‌తో కీలకం పాత్ర పోషించారు. మన్‌మీత్ 2వ నిమిషంలోనే గోల్ చేసి జట్టుకు శుభారంభం అందించాడు. 11వ నిమిషంలో మరో గోల్ చేశాడు. కాసేపటికే 13వ నిమిషంలో శారదానంద్ గోల్ చేసి భారత్ ఆధిక్యం 3-0కు పెంచాడు. అనంతరం అర్ష్‌దీప్ చేసిన గోల్‌తో ఆధిక్యం 4-0కు వెళ్లడంతో మ్యాచ్‌పై పూర్తిగా పట్టుబిగించింది. మరోవైపు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిన స్విట్జర్లాండ్ ప్రభావం చూపించలేకపోయింది. ఒక్క గోల్ కూడా చేయలేదు. మరో 6 నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా శారదానంద్ తన గోల్ చేయడంతో భారత్ చివరికి 5-0తో విజయం సాధించింది. ఈ నెల 5న జరిగే క్వార్టర్ ఫైనల్ పోరులో భారత.. బెల్జియంను ఎదుర్కోనుంది.


Next Story