కష్టాల్లో పాక్.. మూడో టెస్టులో విజయం దిశగా ఆసిస్

by Dishanational5 |
కష్టాల్లో పాక్.. మూడో టెస్టులో విజయం దిశగా ఆసిస్
X

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్‌పై ఇప్పటికే రెండు టెస్టుల్లో గెలిచి సిరీస్ దక్కించుకున్న ఆతిథ్య ఆస్ట్రేలియా మూడో మ్యాచ్‌లోనూ విజయంపై కన్నేసింది. శుక్రవారం రెండో ఇన్నింగ్స్‌లో పాక్‌ కీలక వికెట్లు తీసి మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది. మరోవైపు, తొలి ఇన్నింగ్స్ శుభారంభాన్ని కొనసాగించలేక పాకిస్తాన్ కష్టాల్లో పడింది. ముందుగా ఓవర్‌నైట్ స్కోరు 116/2తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియా 299 పరుగులు చేసింది. లబుషేన్(60), మిచెల్ మార్ష్(54) హాఫ్ సెంచరీలు చేశారు. స్టీవ్ స్మిత్(38), అలెక్స్ కేరీ(38) విలువైన పరుగులు జోడించారు. అమీర్ జమాల్ 6 వికెట్ల ప్రదర్శనతో ఆసిస్‌ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 313 పరుగులు చేసిన విషయం తెలిసిందే.దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పాక్‌ను ఆసిస్ బౌలర్లు కట్టడి చేశారు. ముఖ్యంగా హాజెల్‌వుడ్ ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు. 5 ఓవర్లు వేసిన అతను కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. కెప్టెన్ షాన్ మసూద్(0), సౌద్ షకీల్(2), సాజిద్ ఖాన్(0), అఘా సల్మాన్(0)లను అవుట్ చేసి పాక్ మిడిలార్డర్‌ను కూల్చేశాడు. సైమ్ అయూబ్(33), బాబర్ ఆజామ్(23) కాసేపు పోరాటం చేసి పెవిలియన్ చేరారు. మహ్మద్ రిజ్వాన్(6 బ్యాటింగ్), అమీర్ జమాల్(0 బ్యాటింగ్) ఆచితూచి ఆడి వికెట్లు కాపాడుకుని మూడో రోజు ముగించారు. ఆట ముగిసే సమయానికి పాక్ జట్టు 7 వికెట్లను కోల్పోయి 68 పరుగులు మాత్రమే చేసింది. దీంతో పాక్ 82 పరుగుల ఆధిక్యంలో ఉన్నది. పాక్ చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉండగా ఆసిస్ ముందు స్వల్ప లక్ష్యాన్నే నిర్దేశించే అవకాశాలు ఉన్నాయి. దీంతో శనివారమే ఆస్ట్రేలియా విజయం ఖాయం కావొచ్చు.



Next Story