పుణేరి పల్టాన్‌ దూకుడుకు జైపూర్ బ్రేక్

by Dishanational3 |
పుణేరి పల్టాన్‌ దూకుడుకు జైపూర్ బ్రేక్
X

దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న పుణేరి పల్టాన్‌‌ జోరుకు బ్రేక్ పడింది. ఆ జట్టుకు డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ గట్టి షాకిచ్చింది. జైపూర్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో పుణేరి పల్టాన్‌ను 34-36 తేడాతో ఓడించింది. దీంతో ఓపెనింగ్‌ మ్యాచ్‌లో ఓటమికి జైపూర్ ప్రతీకారం తీర్చుకుంది. మ్యాచ్ ప్రారంభంలో పుణేరి పల్టాన్‌దే ఆధిపత్యం. ఆ జట్టు ఆటగాళ్ల దూకుడు చేస్తే విజయం ఆ జట్టుదే అనిపించింది. వరుసగా పాయింట్లు సాధించడంతోపాటు జైపూర్‌ను ఓ సారి ఆలౌట్ చేసిన పుణేరి పల్టాన్ ఫస్టాఫ్ ముగిసే సమయానికి 20-11తో ఆధిక్యంలో నిలిచింది. అయితే, సెకండాఫ్‌లో జైపూర్ కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ సంచలన ప్రదర్శన చేశాడు. ఇంటరి పోరాటం చేసి జట్టును పోటీలోకి తెచ్చాడు. ఈ క్రమంలో పుణేరి పల్టాన్ రెండు సార్లు ఆలౌటైంది. ఈ నేపథ్యంలోనే 24-23తో పుణేరిని వెనక్కినెట్టిన జైపూర్.. అదే జోరులో మ్యాచ్‌ను దక్కించుకుంది. అర్జున్ దేశ్వాల్ 16 పాయింట్లతో జైపూర్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వరుసగా 8 విజయాల తర్వాత పుణేరి పల్టాన్ ఓటమిని రుచిచూసింది. అయితే, పాయింట్స్ టేబుల్‌లో మాత్రం ఆ జట్టు అగ్రస్థానాన్ని కాపాడుకుంది. వరుసగా నాలుగో విజయం నమోదు చేసిన జైపూర్ టాప్ పొజిషన్‌కు చేరువైంది. మరోవైపు, టోర్నీలో యూపీ యోధాస్ ఓటమి పరంపర కొనసాగుతోంది. తాజా ఆ జట్టు వరుసగా ఐదో పరాజయం పొందింది. యూపీ యోధాస్‌‌ను 37-42 తేడాతో చిత్తు చేసిన బెంగాల్ వారియర్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది.


Next Story

Most Viewed