ఐదో టెస్టుకు పంత్ దూరం.. అతని స్థానంలో తమిళనాడు వికెట్ కీపర్‌కు చాన్స్

by Harish |

నాలుగో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కుడి కాలు పాదానికి తీవ్ర గాయమైన విషయం తెలిసిందే.

ఐదో టెస్టుకు పంత్ దూరం.. అతని స్థానంలో తమిళనాడు వికెట్ కీపర్‌కు చాన్స్
X

దిశ, స్పోర్ట్స్ : నాలుగో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కుడి కాలు పాదానికి తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. గాయం కారణంగా పంత్ ఐదో టెస్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది. మెడికల్ టీమ్ అతన్ని పర్యవేక్షిస్తున్నదని, అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే, పంత్ స్థానంలో తమిళనాడు వికెట్ కీపర్ నారాయణ్ జగదీశన్‌‌ను జట్టులోకి వచ్చాడు. జాతీయ జట్టు నుంచి పిలుపు అందుకోవడం అతనికి ఇదే తొలిసారి. ఆదివారం అతనికి వీసా అందిందని, మంగళవారం లండన్‌లో జట్టుతో కలుస్తాడని జాతీయ మీడియా పేర్కొంది. ధ్రువ్ జురెల్‌కు జగదీశన్‌ బ్యాకప్‌గా ఉండనున్నాడు. మూడు, నాలుగు టెస్టుల్లో గాయపడిన పంత్ స్థానంలో జురెలే వికెట్ కీపింగ్ చేసిన విషయం తెలిసిందే. 29 ఏళ్ల జగదీశన్‌కు దేశవాళీలో మంచి రికార్డు ఉంది. గత రెండు రంజీ ట్రోఫీ సీజన్లలో తమిళనాడు తరపున అతనే టాప్ స్కోరర్. 2023-24లో 13 ఇన్నింగ్స్‌ల్లో 816 రన్స్, 2024-25లో 674 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 79 ఇన్నింగ్స్‌లో 47.50 సగటుతో 3,373 రన్స్ చేశాడు. అందులో 10 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గతేడాది చండీగఢ్‌‌పై ట్రిపుల్ సెంచరీ చేశాడు.


Next Story