IPL 2026 : ఒక్క బెర్త్.. నాలుగు జట్లు.. ఆసక్తికరంగా మారిన నాలుగో ప్లే ఆఫ్స్ బెర్త్

by Harish |

IPL 2026 : ఒక్క బెర్త్.. నాలుగు జట్లు.. ఆసక్తికరంగా మారిన నాలుగో ప్లే ఆఫ్స్ బెర్త్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2026లో లీగ్ దశ దగ్గరపడింది. ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి. ఇక వెళ్లాల్సింది మరో జట్టే. మిగిలిన ఆ ఒక్క బెర్త్ కోసం పోటీ ఆసక్తికరంగా మారింది. నాలుగు జట్లూ రేసులో ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ 14 పాయింట్లతో ముందు వరుసలో ఉంది. పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ చెరో 13 పాయింట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ 12 పాయింట్లతో రేసులో ఉన్న నాలుగో జట్టు. ఈ నాలుగు జట్లకు లీగ్ దశలో ఇంకో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. తమ ఆఖరి గేముల్లోనే ఈ జట్ల భవితవ్యం తేలనుంది.

ప్లే ఆఫ్స్ రేసులో ముందున్న రాజస్థాన్ రాయల్స్ ఆదివారం ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే 16 పాయిట్లతో ఆర్ఆర్ నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఎందుకంటే మిగతా జట్లు 16 పాయింట్స్ చేరుకోలేవు. ఒకవేళ ఓడితే భారీ పరాజయం పొందొద్దు. ఎందుకంటే వారి నెట్‌రన్‌రేట్(+0.083) ఆందోళనకంగా ఉంది. లక్నో చేతిలో పంజాబ్, ఢిల్లీ చేతిలో కేకేఆర్ ఓడితే ఆర్‌ఆర్‌కు లైన్ క్లియర్ అవుతుంది. కానీ, పంజాబ్, కేకేఆర్ జట్లలో ఏ జట్టు గెలిచినా రాజస్థాన్ ఆశలు గల్లంతైనట్టే. ఇదంతా ముంబై చేతిలో ఓడితే. అదే గెలిస్తే రాజస్థాన్‌కు ఈ సమీకరణాలతో పనిలేదు.

పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ చివరి మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌కు వెళ్లే చాన్స్ ఉంటుంది. 15 పాయింట్లతో రేసులో ఉంటాయి. అదే సమయంలో ఎంఐ చేతిలో రాజస్థాన్ ఓడిపోవాలి. అప్పుడు పంజాబ్, కేకేఆర్‌లలో నెట్‌రన్‌రేట్ ఎక్కువగా ఉన్న జట్టు ముందడుగు వేస్తుంది. ఆర్‌ఆర్ గెలిస్తే పంజాబ్, కేకేఆర్ గెలిచినా ఉపయోగం ఉండదు. శనివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో పంజాబ్ తలపడనుంది. ఆదివారం ఢిల్లీతో కేకేఆర్ ఆడనుంది.

ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే అద్భుతమే జరగాలి. రాజస్థాన్, పంజాబ్, కోల్‌కతా.. ఈ మూడు జట్లు ఓడిపోతేనే డీసీకి అవకాశాలు ఉంటాయి. అలా జరిగితేనే సరిపోదు. ముంబై చేతిలో ఆర్‌ఆర్ భారీ ఓటమి చవిచూడాలి. అలాగే ఆదివారం కేకేఆర్‌తో జరిగే తమ చివరి మ్యాచ్‌లో గెలవడమే కాకుండా భారీగా నెట్‌రన్‌రేట్ పెంచుకోవాలి. అప్పుడు 14 పాయింట్లతో ఆర్‌ఆర్‌తో సమంగా నిలిచినా మెరుగైన నెట్‌ రన్‌రేట్ కారణంగా ఢిల్లీ ముందడుగు వేస్తోంది.


Next Story