లక్ష్యసేన్ ఓటమి.. క్వారర్ట్స్ ఫైనల్స్‌కు యువ షట్లర్ కిరణ్

by Dishanational5 |
లక్ష్యసేన్ ఓటమి.. క్వారర్ట్స్ ఫైనల్స్‌కు యువ షట్లర్ కిరణ్
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ ఆటగాడు లక్ష్యసేన్ పేలవ ఫామ్‌ కొనసాగుతోంది. జకార్తాలో జరుగుతున్న ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో రెండో రౌండ్‌లోనే ఇంటిదారిపట్టాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో లక్ష్యసేన్ 19-21, 18-21 తేడాతో వరల్డ్ నం.7, డెన్మార్క్ ప్లేయర్ అండర్స్ అంటోన్సెన్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. గంటకుపైగా ఆసక్తికరంగా సాగిన ఈ పోరులో లక్ష్యసేన్ పోరాడి ఓడాడు. తొలి గేమ్‌లో మొదట 7-3తో ఆధిక్యంలో ఉన్న అతను ఆ తర్వాత పలు తప్పిదాలతో గేమ్‌ను పొగొట్టుకున్నాడు. రెండో గేమ్‌లో ఇద్దరు నువ్వా నేనా అన్నట్టు పాయింట్ల కోసం పోటీపడ్డారు. ఈ సమయంలో 13-15తో లక్ష్యసేన్ స్వల్ప లీడ్ సాధించినప్పటికీ ప్రత్యర్థి పుంజుకోవడంతో మ్యాచ్‌ను సమర్పించుకోవాల్సి వచ్చింది. మరోవైపు, భారత యువ షట్లర్ కిరణ్ జార్జ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. రెండో రౌండ్‌లో కిరణ్ 21-11, 13-21, 21-18 తేడాతో చైనా ఆటగాడు లు గుయాంగ్ జు‌పై విజయం సాధించాడు. పూర్తి ఆధిపత్యంతో తొలి గేమ్‌ను దక్కించుకుని కిరణ్ శుభారంభం చేశాడు. అయితే, రెండో గేమ్‌లో ప్రత్యర్థి పుంజుకుని రెండో గేమ్‌ నెగ్గడంతో మ్యాచ్ నిర్ణయాత్మక మూడో గేమ్‌కు వెళ్లింది. హోరాహోరీగా సాగిన మూడో గేమ్‌లో మొదట కిరణ్ కాస్త వెనుకబడినా తిరిగి పుంజుకున్నాడు. 18-18తో స్కోరు సమమైన వేళ వరుసగా మూడు పాయింట్లు గెలుచుకుని మూడో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. మరో యువ షట్లర్ ప్రియాన్ష్ రజావత్ పోరాటం రెండో రౌండ్‌లోనే ముగిసింది. కెనడా ప్లేయర్ బ్రియాన్ యాంగ్ చేతిలో 21-18, 21-14 తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించాడు.


Next Story