T20 World Cup: మరోసారి చరిత్ర సృష్టించిన భారత మహిళలు.. తొలి బ్లైండ్ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌ కైవసం

by Ramesh Naini |   (  Updated:2025-11-23 10:12:12  IST  )

తొలి మహిళల బ్లైండ్ టీ20 వరల్డ్ కప్‌ను భారత మహిళల క్రికెట్ జట్టు చారిత్రాత్మకంగా కైవసం చేసుకుంది.

T20 World Cup: మరోసారి చరిత్ర సృష్టించిన భారత మహిళలు.. తొలి బ్లైండ్ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌ కైవసం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తొలి మహిళల బ్లైండ్ టీ20 వరల్డ్ కప్‌ను భారత మహిళల క్రికెట్ జట్టు చారిత్రాత్మకంగా కైవసం చేసుకుంది. ఆదివారం శ్రీలంకలోని కొలంబోలో జరిగిన ఫైనల్‌లో నేపాల్‌పై ఏకపక్షంగా 7 వికెట్ల తేడాతో గెలిచిన భారత్, టోర్నమెంట్ మొత్తం నంబర్ వన్‌గా నిలిచారు. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత జట్టు, నేపాల్‌ను 20 ఓవర్లలో 5 వికెట్లకు 114 పరుగులకే పరిమితం చేసింది. అనంతరం భారత బ్యాటర్లు అద్భుత ఆట, దూకుడు ప్రదర్శిస్తూ లక్ష్యాన్ని కేవలం 12.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. 47 బంతులు మిగిలి ఉండగానే చేరుకున్న ఈ విజయంలో (Khula Sharir ) ఖులా షరిర్ 27 బంతుల్లో నాటౌట్ 44 పరుగులు (4 బౌండరీలు)తో మెరిసి జట్టును గెలిపించారు.

ఇటీవల ముంబైలో దక్షిణాఫ్రికాపై భారత మహిళా జట్టు వరల్డ్ కప్ సాధించిన విజయం తర్వాత.. మరో కీలక టైటిల్‌ను గెలుచుకోవడంతో భారత మహిళల క్రీడా శక్తి మరింత వెలుగులోకి వచ్చింది. కాగా, భారత్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్‌ జట్లు పాల్గొన్న ఈ ఆరు జట్ల టోర్నమెంట్ నవంబర్ 11న న్యూఢిల్లీ లో ప్రారంభమైంది. తర్వాత కొన్ని మ్యాచ్‌లు బెంగళూరులో జరగగా, నాకౌట్ శ్రీలంకలోని కొలంబోలో ఏర్పాటు చేశారు. భారత జట్టు ఈ చారిత్రాత్మక టైటిల్‌తో బ్లైండ్ క్రికెట్ ఎదుగుదలకు కొత్త దారులు తెరిచింది. ఈ విజయం భవిష్యత్తులో మహిళా బ్లైండ్ క్రికెట్‌కు మరింత గుర్తింపు లభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

టోర్నమెంట్‌లో భారత ప్రయాణం ఇలా..

  • శ్రీలంకపై 10 వికెట్ల విజయం
  • ఆస్ట్రేలియాపై 209 పరుగుల భారీ విజయం
  • నేపాల్‌పై 85 పరుగుల తేడాతో విజయం
  • యునైటెడ్ స్టేట్స్‌పై 10 వికెట్ల తేడాతో ఘనత
  • పాకిస్తాన్‌పై 8 వికెట్లతో మరొక ధైర్యవంతమైన గెలుపు
  • సెమీఫైనల్: ఆస్ట్రేలియాపై 9 వికెట్ల విశేష విజయం
  • ఫైనల్: నేపాల్‌పై 7 వికెట్ల తేడాతో కప్ కైవసం (కొలంబో)
Next Story