విశ్వవిజేతలను కలిసిన ప్రధాని.. ధైర్యం, పట్టుదల ప్రదర్శించారని కితాబు

by Harish |   (  Updated:2025-11-06 08:01:01  IST  )

భారత మహిళల క్రికెట్ జట్టు 47 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలి ఐసీసీ వరల్డ్ కప్ టైటిల్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

విశ్వవిజేతలను కలిసిన ప్రధాని.. ధైర్యం, పట్టుదల ప్రదర్శించారని కితాబు
X

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళల క్రికెట్ జట్టు 47 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలి ఐసీసీ వరల్డ్ కప్ టైటిల్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చారిత్రాత్మక విజయం సాధించిన భారత మహిళల జట్టును ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం సన్మానించారు. భారత ప్లేయర్లు మంగళవారమే ముంబై నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం సాయంత్రం లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మోడీ.. భారత ప్లేయర్ల‌తో చాలా సేపు ముచ్చటించారు. అపూర్వ విజయాన్ని సాధించిన భారత ప్లేయర్లను అభినందించారు. ఈ సందర్భంగా ప్రపంచకప్ ప్రయాణం, ఇతర విషయాల ప్లేయర్లతో చర్చించారు. వరల్డ్ కప్‌లో వరుసగా మూడు ఓటముల తర్వాత ధైర్యం, పట్టుదల ప్రదర్శించిన జట్టును ప్రశంసించారు. దీన్ని జట్టు కృష్టిగా అభివర్ణించారు. సోషల్ మీడియా ట్రోలింగ్‌ను ఎదుర్కోవడం, ఒత్తిడిని ప్రేరణగా మార్చుకోవడాన్ని కొనియాడారు. తమ ప్రయాణంలో ప్రోత్సాహాన్ని, మద్దతుగా నిలిచిన ప్రధానికి ప్లేయర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానికి వరల్డ్ కప్ ట్రోఫీని చూపించారు. అలాగే, భారత ప్లేయర్లు సంతకాలు చేసిన జెర్సీని మోడీకి బహుకరించారు.

అప్పుడు ట్రోఫీ లేకుండా.. ఇప్పుడు ట్రోఫీతో

ప్రధాని, ప్లేయర్ల మధ్య ఆసక్తికర సంభాషణలు జరిగాయి. 2017 వరల్డ్ కప తర్వాత మోడీని కలిసిన విషయాన్ని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ గుర్తు చేసుకున్నారు. అప్పుడు ట్రోఫీ లేకుండా కలిశామని, ఇప్పుడు ట్రోఫీతో వచ్చామని హర్మన్ తెలిపింది. స్మృతి మంధాన మాట్లాడుతూ.. ప్రధాని జట్టులో ఎల్లప్పుడు స్ఫూర్తినింపారని, తామందరికీ ప్రేరణగా నిలిచారని చెప్పింది. అమ్మాయిలు ప్రతి రంగంలో రాణిస్తున్నారని, మహిళల సాధికారత కోసం ప్రధాని తీసుకుంటున్న చొరవను ప్రశంసించింది. దీప్తి శర్మతో ప్రధాని మాట్లాడుతూ చేతిపై హనుమంతుడి టాటూ, ఇన్‌స్టాగ్రామ్‌లో బయోలో ‘జై శ్రీరామ్’అని పోస్టు చేయడం గురించి అడిగారు. దీప్తి సమాధానమిస్తూ.. తన విశ్వాసం తనకు బలాన్ని, సానుకూలతను ఇస్తుందని చెప్పింది. అలాగే, సౌతాఫ్రికాతో ఫైనల్‌లో హర్మన్, అమన్‌జోత్ అందుకున్న క్యాచ్‌లను ప్రధాని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు.

Read More... వరల్డ్ కప్‌తో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిని భారత మహిళల క్రికెట్ జట్టు

Next Story