ఆసియా గేమ్స్‌లో నేరుగా క్వార్టర్స్‌కు శ్రేయస్ సేన.. పాక్‌తో మ్యాచ్ ఉంటుందా?

by Harish |

జపాన్‌లో జరగబోయే ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.

ఆసియా గేమ్స్‌లో నేరుగా క్వార్టర్స్‌కు శ్రేయస్ సేన.. పాక్‌తో మ్యాచ్ ఉంటుందా?
X

దిశ, స్పోర్ట్స్ : జపాన్‌లో జరగబోయే ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. క్రికెట్ షెడ్యూల్‌‌ను తాజాగా ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా ప్రకటించింది. టీ20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. పురుషుల విభాగంలో భారత జట్టు టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా నేరుగా క్వార్టర్స్‌కు వెళ్లింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక కూడా నాకౌట్‌కు చేరుకున్నాయి. మరో నాలుగు క్వార్టర్స్ బెర్త్‌ల కోసం ప్రిలిమినరీ రౌండ్ నిర్వహించనున్నారు. అఫ్గానిస్తాన్, జపాన్, నేపాల్, హాంకాంగ్, మలేసియా, ఒమన్ ఈ రౌండ్‌లో పాల్గొంటాయి. ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించగా.. ప్రతి గ్రూపు నుంచి టాప్-2 జట్లు క్వార్టర్స్‌కు వెళ్తాయి.ప్రిలిమినరీ రౌండ్ నుంచి వచ్చిన ఒక్క జట్టుతో క్వార్టర్స్‌లో టీమిండియా ఆడుతుంది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1 వరకు పురుషుల మ్యాచ్‌లు జరగనున్నాయి.

జపాన్‌తో అమ్మాయిలు ఢీ

మహిళల విభాగం నేరుగా క్వార్టర్ ఫైనల్ నుంచే ప్రారంభంకానుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో భారత మహిళల క్రికెట్ జట్టు బీసీసీఐ ఖరారు చేసిన విషయం తెలిసిందే. క్వార్టర్ ఫైనల్‌లో జపాన్‌ను భారత్ ఢీకొట్టనుంది. అక్కడ గెలిస్తే సెమీస్‌లో చైనా లేదా బంగ్లాదేశ్‌తో తలపడొచ్చు. సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు మహిళల టోర్నీ జరగనుంది. పురుషుల, మహిళల విభాగాల్లో భారత్, పాక్ సెమీస్ లేదా ఫైనల్‌లో ఎదురుపడొచ్చు. క్వార్టర్స్‌‌లో ఏ జట్టు ఓడినా దాయాదుల పోరు లేనట్టే. 2023 ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే.

Next Story