Ind W Vs Aus W : అదరగొట్టిన తెలుగమ్మాయిలు.. తొలి టీ20 భారత్‌దే

by Harish |

Ind W Vs Aus W : అదరగొట్టిన తెలుగమ్మాయిలు.. తొలి టీ20 భారత్‌దే
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా పర్యటనను భారత మహిళల క్రికెట్ జట్టు విజయంతో ఆరంభించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా సిడ్నీలో ఆదివారం జరిగిన తొలి టీ20లో విజయం సాధించింది.ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో డీఎల్‌ఎస్ పద్ధతిలో ఫలితం తేల్చగా భారత్ 21 రన్స్ తేడాతో గెలుపొందింది. ముందుగా ఆసిస్ మహిళల జట్టు బ్యాటింగ్ చేయగా 18 ఓవర్లలో 133 పరుగులే చేసి ఆలౌటైంది. ప్రత్యర్థి పతనాన్ని శాసించారు తెలుగమ్మాయిలు అరుంధతి రెడ్డి, శ్రీచరణి. అరుంధతి 4 వికెట్లతో విజృంభించింది. స్పిన్నర్ శ్రీచరణి కూడా రెండు వికెట్లు పడగొట్టింది. వీరిద్దరి ధాటికి ఆస్ట్రేలియా కోలుకోలేకపోయింది. మరో బౌలర్ రేణుక సింగ్ కూడా 2 వికెట్లు తీసింది.

దీంతో ఆసిస్ బ్యాటర్లు విలవిలలాడిపోయారు. ఆ జట్టులో ఒక్కరూ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. జార్జియా వారేహమ్(30), లిచ్‌ఫీల్డ్(26) మాత్రమే చెప్పుకోదగ్గ రన్స్ చేశారు. ఇక, భారత్ ఛేదనకు దిగిన కాసేపటికే భారీ వర్షం పడింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ 5.1 ఓవర్లలో 50/1తో నిలిచింది. పవర్ ప్లేలో షఫాలీ వర్మ(21) ధాటిగా ఆడి వేగంగా పరుగులు రాబట్టింది. మ్యాచ్ కొనసాగే పరిస్థితి లేకపోవడంతో అంపైర్లు డీఎల్‌ఎస్ పద్ధతిలో ఫలితం తేల్చగా భారత్ గెలిచినట్టు ప్రకటించారు. దీంతో టీ20 సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ నెల 19న రెండో టీ20 జరగనుంది.


Next Story