కుల్దీప్, అశ్విన్ స్పిన్ ఉచ్చులో ఇంగ్లాండ్ విలవిల.. తొలి రోజు భారత్‌దే

by Dishanational3 |
కుల్దీప్, అశ్విన్ స్పిన్ ఉచ్చులో ఇంగ్లాండ్ విలవిల.. తొలి రోజు భారత్‌దే
X

దిశ, స్పోర్ట్స్ : టెస్టు సిరీస్‌ను ఇప్పటికే సొంతం చేసుకున్న టీమ్ ఇండియా ఐదో టెస్టుపై కన్నేసింది. ఆ దిశగా తొలి రోజే పునాది వేసుకుంది. కుల్దీప్ యాదవ్, అశ్విన్ స్పిన్ మాయాజాలం ధాటికి బెంబేలెత్తిపోయిన ఇంగ్లాండ్ విలవిలలాడింది. ధర్మశాల వేదికగా గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో భారత్ మొదటి రోజు ఆధిపత్యం ప్రదర్శించింది. మొదటి టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 218 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. జాక్ క్రాలీ(79) మినహా మిగతా వారు తేలిపోయారు. కుల్దీప్ యాదవ్(5/72), అశ్విన్(4/51) స్పిన్ మంత్రంతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. దీంతో ఇంగ్లాండ్ మొదటి రోజే ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమ్ ఇండియా గురువారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్(57), రోహిత్ శర్మ(52 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో మెరిసి భారత్‌కు మంచి శుభారంభం అందించారు. జైశ్వాల్ అవుటైనా.. గిల్‌(26 బ్యాటింగ్)తో కలిసి రోహిత్ క్రీజులో ఉన్నాడు. టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 83 పరుగుల వెనుకబడి ఉంది. రెండో రోజు భారత బ్యాటర్లు చెలరేగి భారీ స్కోరు చేస్తే మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశం ఉంటుంది.

కుల్దీప్ మాయాజాలం

కుల్దీప్ యాదవ్ మరోసారి తన స్పిన్ మంత్రాన్ని ఇంగ్లాండ్‌పై ప్రయోగించాడు. దీంతో ప్రత్యర్థి విలవిలలాడింది. ఒక దశలో ఇంగ్లాండ్ 100/2తో మెరుగైన స్థితిలోనే ఉంది. ఓపెనర్ జాక్ క్రాలీ(79) క్రీజులో పాతుకపోవడంతో మొదట ఆ జట్టుకు మంచి ఆరంభమే దక్కింది. అయితే, కుల్దీప్ మాయాజాలం ఇంగ్లాండ్‌ను కష్టాల్లోకి నెట్టింది. ఓపెనర్ డక్కెట్(27)ను అవుట్ చేసిన అతను ఆ జట్టు పతనాన్ని శాసించాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లు తీస్తూ వచ్చాడు. ఓలీ పోప్(11)ను అవుట్ చేసిన కాసేపటికే క్రీజులో పాతుకపోయిన జాక్ క్రాలీ(79), బెయిర్ స్టో(29)ను పెవిలియన్ పంపాడు. ఇక, జోరూట్(26)ను జడేజా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే కెప్టెన్ స్టోక్స్(0) వికెట్‌ను సాధించిన కుల్దీప్ ఐదు వికెట్ల ప్రదర్శనను పూర్తి చేశాడు. దీంతో 175 పరుగులకే ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఆ తర్వాత ఆ జట్టును ఎవరూ ఆదుకోలేకపోయారు. మరో 43 పరుగుల వ్యవధిలోనే మిగతా 4 వికెట్లు కోల్పోయి కుప్పకూలింది.

స్పెషల్ మ్యాచ్‌లో అశ్విన్ మ్యాజిక్

100వ టెస్టు ఆడుతున్న అశ్విన్ ఈ స్పెషల్ మ్యాచ్‌లో సత్తాచాటాడు. కుల్దీప్ ఇంగ్లాండ్‌ పతనాన్ని శాసించగా.. అశ్విన్ లోయర్ ఆర్డర్‌ భరతం పట్టాడు. తన స్పిన్ మంత్రంతో చివరి నాలుగు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. టామ్ హార్ట్లీ, మార్క్‌వుడ్‌లను పెవిలియన్ పంపిన అతను.. ఒకే ఓవర్‌లో ఫోక్స్‌, అండర్సన్ వికెట్లను పడగొట్టి ఇంగ్లాండ్‌ ఆట ముగించాడు.

రోహిత్, జైశ్వాల్ శుభారంభం

ఇంగ్లాండ్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన భారత్‌ చివరి సెషన్ ఆరంభంలోనే బ్యాటింగ్‌కు దిగింది. టీమ్ ఇండియాకు ఓపెనర్ రోహిత్ శర్మ(52 బ్యాటింగ్), యశస్వి జైశ్వాల్(57) అదిరిపోయే ఆరంభం అందించారు. ఇంగ్లాండ్ బ్యాటర్లు తడబడ్డ అదే పిచ్‌పై వీరు చెలరేగారు. వన్డే తరహాలో బ్యాటు ఝుళిపించిన వీరు బౌండరీలతో అలరించారు. ఈ సిరీస్‌లో భీకర ఫామ్‌లో ఉన్న జైశ్వాల్ షోయబ్ బషీర్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే, అదే ఓవర్‌లో వికెట్ పారేసుకున్నాడు. దీంతో తొలి వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గిల్(26 బ్యాటింగ్) సహకారంతో రోహిత్ సైతం అర్ధ శతకం పూర్తి చేశాడు. రోహిత్, గిల్ కలిసి తొలి రోజు ముగించారు.

స్కోరుబోర్డు

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 218 ఆలౌట్(57.4 ఓవర్లు)

జాక్ క్రాలీ(బి)కుల్దీప్ 79, డక్కెట్(సి)గిల్(బి)కుల్దీప్ 27, ఓలీ పోప్(స్టంఫ్)ధ్రువ్ జురెల్(బి)కుల్దీప్ 11, రూట్ ఎల్బీడబ్ల్యూ(బి)జడేజా 26, బెయిర్‌స్టో(సి)ధ్రువ్ జురెల్(బి)కుల్దీప్ 29, స్టోక్స్ ఎల్బీడబ్ల్యూ(బి)కుల్దీప్ 0, ఫోక్స్(బి)అశ్విన్ 24, టామ్ హార్ట్లీ(సి)పడిక్కల్(బి)అశ్విన్ 6, మార్క్‌వుడ్(సి)రోహిత్(బి)అశ్విన్ 0, షోయబ్ బషీర్ 11 నాటౌట్, అండర్సన్(సి)పడిక్కల్(బి)అశ్విన్ 0, ఎక్స్‌ట్రాలు 5.

వికెట్ల పతనం : 64-1, 100-2, 137-3, 175-4, 175-5, 175-6, 183-7, 183-8, 218-9, 218-10

బౌలింగ్ : బుమ్రా(13-2-51-0), సిరాజ్(8-1-24-0), అశ్విన్(11.4-1-51-4), కుల్దీప్ యాదవ్(15-1-72-5), రవీంద్ర జడేజా(10-2-17-1)

భారత్ తొలి ఇన్నింగ్స్ : 135/1(30 ఓవర్లు)

యశస్వి జైశ్వాల్(స్టంఫ్)ఫోక్స్(బి)షోయబ్ బషీర్ 57, రోహిత్ 52 బ్యాటింగ్, గిల్ 26 బ్యాటింగ్; ఎక్స్‌ట్రాలు 0.

వికెట్ల పతనం : 104-1

బౌలింగ్ : అండర్సన్(4-1-4-0), మార్క్‌వుడ్(3-0-21-0), టామ్ హార్ట్లీ(12-0-46-0), షోయబ్ బషీర్(11-2-64-1

Next Story

Most Viewed