సింధుకు జోరుకు బ్రేక్.. ఇండియా ఓపెన్‌లో ముగిసిన టైటిల్ వేట

by Harish |

సింధుకు జోరుకు బ్రేక్.. ఇండియా ఓపెన్‌లో ముగిసిన టైటిల్ వేట
X

దిశ, స్పోర్ట్స్ : ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత డబుల్స్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి దూకుడు కొనసాగుతోంది. పురుషుల డబుల్స్ విభాగంలో ఈ జోడీ సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో సాత్విక్ జోడీ 21-10, 21-17 తేడాతో కొరియా జంట జెన్ యోంగ్-కాంగ్ మిన్ హ్యుక్‌ను చిత్తు చేసింది. తొలి గేమ్‌ను అలవోకగానే నెగ్గగా.. రెండో గేమ్‌లో మాత్రం కాస్త కష్టపడాల్సి వచ్చింది. 41నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో భారత జంట స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించి రెండు గేముల్లోనే మ్యాచ్‌ను ముగించి సెమీస్‌లో అడుగుపెట్టింది. సెమీస్‌లో ఇండోనేషియాకు చెందిన స్జె ఫీ గో-నూర్ ఇజ్జుద్దీన్‌ ద్వయంతో తలపడనుంది. సాత్విక్, చిరాగ్‌లు 2022లో ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ టైటిల్ గెలిచారు.

సింధు జోరుకు బ్రేక్

టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు ప్రయాణం ముగిసింది. ఉమెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆమె 9-21, 21-19, 17-21 తేడాతో జార్జియా మరిస్క టుంజుంగ్(ఇండోనేషియా) చేతిలో ఓడిపోయింది. తొలి గేమ్‌లో ప్రత్యర్థికి కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. రెండో గేములో నెగ్గి పోటీలోకి వచ్చినా.. నిర్ణయాత్మక మూడో గేములో సింధుకు నిరాశ తప్పలేదు. అలాగే, మెన్స్ సింగిల్స్‌లో కిరణ్ జార్జ్ కూడా క్వార్టర్స్‌లోనే నిష్ర్కమించాడు. చైనా ప్లేయర్ వెంగ్ హాంగ్ యాంగ్ చేతిలో 21-13, 21-19 తేడాతో చిత్తయ్యాడు.


Next Story