సెంచరీ గురించే విసిగించారు: విరాట్ కోహ్లీ

by Disha Web Desk 13 |
సెంచరీ గురించే విసిగించారు: విరాట్ కోహ్లీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్‌ అనంతరం రాహుల్ ద్రవిడ్‌తో కలిసి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చిట్ చాట్ చేశాడు. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయడమే తన సక్సెస్‌కు ప్రధాన కారణమని తెలిపాడు. నాలుగో టెస్ట్‌లో సెంచరీ సాధించిన విరాట్.. మూడేళ్ల నిరీక్షణ తర్వాత 6 సెషన్ల పాటు బ్యాటింగ్ చేసి 186 పరుగులు చేసిన కోహ్లీ కెరీర్‌లోనే అత్యంత స్లో ఇన్నింగ్స్ ఆడాడు. 4 బౌండరీల సాయంతోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. కోహ్లీ విరోచిత బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్ డ్రా కాగా.. భారత్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.

బ్యాటింగ్ పిచ్.. కానీ ఆసీస్ ఈ పిచ్‌ను అద్భుతంగా వాడుకుంది. మిచెల్ స్టార్క్, నాథన్ లయన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. 7-2 ఫీల్డ్‌తో మాపై ఆసీస్ ఒత్తిడి తీసుకురాగా.. నేను మాత్రం ఓపికగా ఆడుతూ.. నా డిఫెన్స్‌ను నమ్ముకున్నా. టెస్ట్ క్రికెట్ ఆడేటప్పుడు నేను ఉపయోగించేది ఇదే. నా డిఫెన్సే అతిపెద్ద బలం. బౌండరీలు అంత సులువుగా రాలేదు. సింగిల్స్, డబుల్స్‌తో సెంచరీ పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉంది. ఎప్పుడూ ఒకే మైండ్‌సెట్‌తో ఆడటం మంచిది కాదు. పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. మూడు ఫార్మాట్లలో నేను రాణించడానికి ప్రధాన కారణం ఇదే.

పరిస్థితులకు తగ్గట్లు ఆడేందుకు నేను మానసికంగా సిద్దమయ్యా. జట్టు కోసం వీలైనంత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయడం.. ఎక్కువ పరుగులు చేయడం నా ప్రధాన లక్ష్యం. అందులో భాగంగానే సెంచరీ రావాలనుకుంటా. కానీ అందరూ సెంచరీ గురించే విసిగించారు. రికార్డులు, మైలు రాళ్ల కోసం ఎప్పుడూ ఆడను. వాటిపై అసలు ఫోకసే పెట్టను. కానీ సెంచరీకే అధిక ప్రాధాన్యత లభిస్తోంది. హోటల్ బాయ్ నుంచి బస్ డ్రైవర్, లిఫ్ట్‌లో ఉన్న వ్యక్తి వరకు ప్రతీ ఒక్కరూ సెంచరీ గురించే మాట్లాడుతున్నారు.

30 పరుగులు చేసినా..

ఓ సెషన్‌లో నేను 30 పరుగులు చేసినా సంతోషిస్తా. బౌండరీలు కొట్టలేదని ఏ మాత్రం నిరాశకు గురవ్వను. 5-6 సెషన్ల పాటు బ్యాటింగ్ చేయడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మానసికంగా, శారీరకంగా ఎంత దృడంగా ఉన్నామో తెలుస్తోంది. కఠిన పరిస్థితుల్లో జట్టు కోసం ఆడటాన్ని నేనేప్పుడూ గొప్పగా ఫీలవుతా.'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను బీసీసీఐ షేర్ చేయగా వైరల్ అయ్యింది.

Next Story

Most Viewed