బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్ రిలీజ్.. తొలి టెస్టు ఎప్పుడంటే?

by Dishanational3 |
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్ రిలీజ్.. తొలి టెస్టు ఎప్పుడంటే?
X

దిశ, స్పోర్ట్స్ : భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ప్రతిష్టా్త్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం రిలీజ్ చేసింది. ఈ ఏడాది ఈ సిరీస్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. పెర్త్ వేదికగా ఇరు జట్లు తొలి టెస్టులో తలపడనుండగా.. నవంబర్ 22 నుంచి 26 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. అలాగే, డిసెంబర్ 6-10 మధ్య డే అండ్ నైట్‌గా జరిగే రెండో టెస్టుకు అడిలైడ్, డిసెంబర్ 14-18 మధ్య జరిగే మూడో టెస్టుకు బ్రిస్బేన్‌ ఆతిథ్యమివ్వనున్నాయి. ఇక, మెల్‌బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి 30 వరకు బాక్సింగ్ డే టెస్టు జరగనుంది. చివరిదైన ఐదో టెస్టుకు వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 7 వరకు సిడ్నీ ఆతిథ్యమివ్వనుంది.

గత ఎడిషన్ వరకు నాలుగు మ్యాచ్‌లుగా కొనసాగిన ఈ సిరీస్ ఇకపై ఐదు మ్యాచ్‌లుగా జరగనుంది. 1991-92 తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఐదు టెస్టుల నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ సిరీస్‌లో వరుసగా నాలుగు సార్లు టీమ్ ఇండియా టైటిల్ కైవసం చేసుకుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా జరిగే ఈ సిరీస్‌ భారత్‌‌కు కీలకం కానుంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో భారత్ అగ్రస్థానంలో ఉండగా.. ఆసిస్ రెండో స్థానంలో ఉన్నది.

ఆసిస్‌కు పర్యటనకు మహిళల జట్టు

ఈ ఏడాది చివర్లో భారత మహిళల క్రికెట్ జట్టు కూడా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఆసిస్ మహిళల జట్టుతో మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. డిసెంబర్ 5న తొలి వన్డేతో సిరీస్ మొదలు కానుండగా.. 8వ తేదీన రెండో వన్డే జరగనుంది. తొలి రెండు మ్యాచ్‌లకు బ్రిస్బేన్ ఆతిథ్యమివ్వనుండగా.. డిసెంబర్ 11న జరిగే ఆఖరి మూడో వన్డే పెర్త్ వేదికగా జరగనుంది. తొలి, మూడో వన్డే మ్యాచ్‌లు డే అండ్ నైట్‌గా జరగనున్నాయి.

Next Story

Most Viewed