మహిళల వరల్డ్ కప్‌లో నేడు పాక్‌తో భారత్ ఢీ.. అదే రిపీట్ అయితే టీమిండియాదే గెలుపు

by Harish |

మహిళల వరల్డ్ కప్‌లో భాగంగా నేడు పాకిస్తాన్‌తో భారత జట్టు తలపడనుంది.

మహిళల వరల్డ్ కప్‌లో నేడు పాక్‌తో భారత్ ఢీ.. అదే రిపీట్ అయితే టీమిండియాదే గెలుపు
X

దిశ, స్పోర్ట్స్ : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు శుభారంభం చేసిన విషయం తెలిసిందే. తమ తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిచి జోష్ మీద ఉంది. నేడు పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు కొలంబో వేదిక. ఏ రకంగా చూసుకున్న ఈ మ్యాచ్‌లో భారతే ఫేవరెట్. ప్రాతిక రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్, రిచా ఘోష్‌లతో 8వ స్థానం వరకు భారత్ బ్యాటింగ్ దళం పటిష్టంగా ఉంది. గత మ్యాచ్‌లో దీప్తి, అమన్‌జ్యోత్ హాఫ్ సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. దీప్తి, శ్రీచరణి, స్నేహ్ రాణా‌ బౌలింగ్‌లో కీలకం కానున్నారు. ఇక, పాక్ గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడి ఢీలా పడింది. ఆ మ్యాచ్‌లో పాక్ 129 పరుగులకే ఆలౌటవడం ఆ జట్టు బ్యాటింగ్ బలహీనతను తెలియజేస్తోంది. ఇక, హెడ్ టూ హెడ్ రికార్డ్స్ విషయానికొస్తే.. టీమిండియాదే వన్ వే ట్రాఫిక్. ఇప్పటివరకు ఇరు జట్లు వన్డేల్లో 11సార్లు తలపడితే అన్నింట భారతే గెలిచింది. పాక్ ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేదు. నేటి మ్యాచ్‌లోనూ నెగ్గి తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని హర్మన్‌ప్రీత్ సేన భావిస్తున్నది.

నో షేక్‌‌హ్యాండ్!

ఇటీవల ఆసియా కప్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లకు భారత క్రికెటర్లు షేక్‌హ్యాంక్ ఇవ్వకపోవడం ఎంత చర్చనీయాంశమైందో తెలిసిందే. నేటి మ్యాచ్‌లో అమ్మాయిల జట్టు కూడా అదే విధానాన్ని ఫాలోకానున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. పాక్ క్రీడాకారిణులతో భారత క్రీడాకారిణులు కరచాలనం చేయరని పేర్కొన్నాయి.


Next Story