Women's T20 World Cup : రిచా ఘోష్ ఒంటరి పోరాటం వృథా.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి

by Harish |

టీ20 వరల్డ్ కప్‌కు ముందు భారత మహిళల క్రికెట్ జట్టుకు షాక్ తగిలింది.

Womens T20 World Cup : రిచా ఘోష్ ఒంటరి పోరాటం వృథా.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌కు ముందు భారత మహిళల క్రికెట్‌కు షాక్ తగిలింది. బుధవారం జరిగిన తమ రెండో వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో పరాజయం పాలైంది. చివరి వరకూ ఆసక్తికరంగా సాగిన గేములో 5 వికెట్ల తేడాతో భారత్ ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఆ జట్టులో అమీ జోన్స్(64), నాట్ స్కివర్ బ్రంట్(57) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 70 పరుగుల పార్ట్‌నర్‌షిప్ జత చేశారు. గిబ్సన్ చిన్నపాటి విధ్వంసం సృష్టించింది. 12 బంతుల్లో 30 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఇక 172 పరుగుల లక్ష్య ఛేదనలో భారత జట్టు పోరాడినా ఫలితం దక్కలేదు. టాపార్డర్ తేలిపోవడం ఓటమికి కారణమైంది. స్మృతి మంధాన(1), షెఫాలీ వర్మ(13), యాస్తికా భాటియా(15), హర్మన్‌ప్రీత్ కౌర్(17), భార్టి ఫుల్మాలి(18) దారుణంగా నిరాశపరిచారు. దీంతో 87 పరుగులకే భారత్ 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓటమి అంచున నిలిచిన జట్టులో రిచా ఘోష్ ఆశలు రేపింది. ఒక వైపు వికెట్లు పడుతున్నా ఆమె మాత్రం ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. 36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టి 68 పరుగులు చేసింది. చివరి ఓవర్ వరకూ పోరాడింది. అయితే ఆమెకుతోడుగా మరో ఎండ్‌లో ఎవరూ రాణించకపోవడంతో రిచా పోరాటం వృథా అయ్యింది. మరో బంతి మిగిలి ఉండగానే భారత్ 166 పరుగుల వద్ద ఆలౌటైంది. తొలి వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా వెస్టిండీస్‌పై విజయం సాధించింది. అయితే ఇంగ్లాండ్‌తో పోరాడి ఓడటం జట్టు ఆత్మవిశ్వాసాన్ని కాస్త దెబ్బతేసేది. ఈ నెల 12 నుంచి మహిళల టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది. ఈ నెల 14న భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఎదుర్కోనుంది.


Next Story