మూడో టెస్టుకు వాళ్లిద్దరూ డౌటే?.. కోహ్లీ, జడేజా రాకపై అనుమానాలు

by Dishanational3 |
మూడో టెస్టుకు వాళ్లిద్దరూ డౌటే?.. కోహ్లీ, జడేజా రాకపై అనుమానాలు
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమ్ ఇండియాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఒకవైపు తొలి టెస్టు ఓటమితో సిరీస్‌లో వెనుకబడగా.. మరోవైపు, స్టార్ ప్లేయర్లు దూరమవడం రోహిత్ సేనను దెబ్బతీస్తున్నది. వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ, గాయం కారణంగా మహ్మద్ షమీ తొలి రెండు టెస్టులకు దూరమైన విషయం తెలిసిందే. అలాగే, హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో పరుగు కోసం ప్రయత్నించే క్రమంలో జడేజా తొడ కండరాల గాయం బారిన పడ్డాడు. అదే మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ తొడ నొప్పితో బాధపడ్డాడు. దీంతో నేటి నుంచి విశాఖపట్నం వేదికగా జరిగే రెండో టెస్టుకు వీరు అందుబాటులో ఉండటం లేదు. ప్రస్తుతం వీరిద్దరూ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో చేరారు. రాజ్‌కోట్ వేదికగా ఈ నెల 15 నుంచి 19 వరకు మూడో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‌కు షమీ, కోహ్లీ, జడేజా అందుబాటులో ఉండటంపై అనుమానాలు నెలకొన్నాయి. అందుకే, మిగతా మూడు టెస్టుల కోసం జట్టును ప్రకటించడంలో బీసీసీఐ ఆలస్యం చేస్తుందని తెలుస్తోంది.

సిరీస్ మొత్తానికి షమీ దూరం?

స్టార్ పేసర్ మహ్మద్ షమీ వన్డే వరల్డ్ కప్ తర్వాత మోకాలి గాయం బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సౌతాఫ్రికా సిరీస్‌కు కూడా అతను దూరమయ్యాడు. ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు కూడా అతను అందుబాటులో లేడు. మిగతా సిరీస్‌కు షమీ అందుబాటులోకి వస్తాడని భావించినప్పటికీ అది సాధ్యపడేలా కనిపించడం లేదని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అతను లండన్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో అతను సిరీస్ మొత్తానికి దూరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ నాటికి అతను అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

మూడో టెస్టుకు జడేజా, కోహ్లీ డౌటే!

వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ తొలి రెండు టెస్టులకు దూరమైన విషయం తెలిసిందే. మిగతా మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉంటాడని వార్తలు వచ్చాయి. అయితే, అతను రాజ్‌కోట్ వేదికగా జరిగే మూడో టెస్టుకు కూడా దూరంగా ఉంటాడని తెలుస్తోంది. ప్రస్తుతం కోహ్లీ విదేశాల్లో ఉన్నాడని ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. అతను జట్టుతో ఎప్పుడు కలుస్తాడన్న విషయంపై అనుమానాలు నెలకొన్నట్టు తెలిపింది. మరోవైపు, తొలి టెస్టులో గాయపడిన జడేజా సైతం మూడో మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదని సమాచారం. తొడ కండరాల గాయం బారిన పడిన అతను కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు సమయం పడుతుందని తెలుస్తోంది. మరోవైపు, కేఎల్ రాహుల్ మూడో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Next Story

Most Viewed