ముంబై క్రికెటర్లకు బొనాంజా.. ముంబై క్రికెట్ అసోసియేషన్ చారిత్రాత్మక నిర్ణయం

by Dishanational3 |
ముంబై క్రికెటర్లకు బొనాంజా.. ముంబై క్రికెట్ అసోసియేషన్ చారిత్రాత్మక నిర్ణయం
X

దిశ, స్పోర్ట్స్ : ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ముంబై తరపున రంజీ ట్రోఫీ ఆడే క్రికెటర్లకు అదనంగా మ్యాచ్ ఫీజులు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. శనివారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో భారత క్రికెట్‌లో రంజీ ప్లేయర్లకు మ్యాచ్ ఫీజులు ఇవ్వబోతున్న తొలి అసోసియేషన్‌గా ఎంసీఏ నిలిచింది.

ప్రస్తుతం రంజీ ట్రోఫీ ఆడే క్రికెటర్లలో 40 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల కంటే ఎక్కువ ఆడిన వారికి లీగ్ మ్యాచ్‌కు రూ.2.40 లక్షలు, నాకౌట్‌ మ్యాచ్‌కు రూ.3 లక్షలు బీసీసీఐ అందజేస్తోంది. ఈ మ్యాచ్‌ ఫీజుకు ఎంసీఏ అందించే మ్యాచ్ ఫీజు అదనం. బీసీసీఐ అందించే మొత్తంతో సమానంగా ముంబై క్రికెటర్లు మ్యాచ్ ఫీజులను అందుకోనున్నారు. అంటే, లీగ్ దశలో రూ. 4.80 లక్షలు, నాకౌట్ మ్యాచ్‌కు రూ. 6 లక్షలు పొందనున్నారు. అలాగే, 21-40 మధ్య ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు రూ. లక్షా, 20 కంటే తక్కువ మ్యాచ్‌లు ఆడిన వారు రూ. 80 వేలు అందుకోనున్నారు.

‘రంజీ ట్రోఫీని ప్రోత్సహించడం, ఎంసీఏ పరిధిలో రెడ్ బాల్ క్రికెట్‌ను వృద్ధి లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆటగాళ్లు, ముఖ్యంగా రంజీ ట్రోఫీ క్రికెట్ ఆడే ప్లేయర్లు ఎక్కువగా సంపాదించాలని భావించాం. రంజీ ట్రోఫీలో ముంబైలోని ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైనది.’ అని ఎంసీఏ అధ్యక్షుడు అమోల్ కాలే తెలిపారు. తదుపరి సీజన్ నుంచి ఎంసీఏ నిర్ణయం అమల్లోకి వస్తుందని చెప్పారు. ఇటీవల ముంబై జట్టు అజింక్యా రహానే సారథ్యంలో 42వ రంజీ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed