ఇండియాకు షాక్..పాకిస్తాన్ కండీష‌న్ల‌కు ఐసీసీ గ్రీన్ సిగ్న‌ల్ ?

by velandi.Saikiran |

ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా ( ICC Deputy Chairman Imran Khwaja ) రంగంలోకి దిగారు. దుబాయ్ నుంచి నేరుగా పాకిస్తాన్ లోని గడాఫీలో దిగారు ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా.

ఇండియాకు షాక్..పాకిస్తాన్ కండీష‌న్ల‌కు ఐసీసీ గ్రీన్ సిగ్న‌ల్ ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: పొట్టి ఫార్మాట్‌ టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ డిమాండ్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నెరవేర్చేందుకు సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ కు అన్యాయం జరిగిందని భారత జట్టుతో జరిగే మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు ఇప్పటికే పాకిస్తాన్ ప్రధాని షరీఫ్, పీసీబీ ఇప్పటికే ప్రకటించాయి. అయితే, పాకిస్తాన్, భారత్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ఒకవేళ జరగకపోతే తీవ్ర నష్టాలు ఉండే ప్రమాదం ఉంది. దాదాపు నాలుగు వేల కోట్ల వరకు నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉన్నట్లు చెబుతున్నారు. ఈ స్థాయిలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పైన పెనాల్టీ వేసినప్పటికీ, వాళ్లు కట్టే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలోనే పాకిస్తాన్ డిమాండ్లను ఐసీసీ పరిశీలిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

పాకిస్తాన్ డిమాండ్లకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ?

ఇండియాతో పాకిస్తాన్ మ్యాచ్ ఆడేలా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చర్చలు జరుపుతూనే ఉంది. పాకిస్తాన్ ఎంత మొండి పట్టు పట్టినా, శాంతియుతంగా చర్చలు జరిపేందుకే మొగ్గు చూపిస్తోందట ఐసీసీ. అయితే ఇందులో భాగంగానే నేరుగా ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా ( ICC Deputy Chairman Imran Khwaja ) రంగంలోకి దిగారు. దుబాయ్ నుంచి నేరుగా పాకిస్తాన్ లోని గడాఫీలో దిగారు ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా. దీనికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఈ సందర్భంగా పాకిస్తాన్ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ న‌ఖ్వీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ అనిముల్ ఇస్లాం (Animul Islam). బాయ్ కాట్ సమస్య బంగ్లాదేశ్ కారణంగా వచ్చిన నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ అనిముల్ ఇస్లాం కూడా పాకిస్తాన్ కు చేరుకున్నాడు. ఈ సందర్భంగా నఖ్వీ, అనిముల్ ఇస్లాంతో ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ‌వాజా గడాఫీలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ కొన్ని డిమాండ్లు పెట్టిందట. ఇండియాతో వన్డే సిరీస్ ఏర్పాటు చేయాలని... అలాగే ఇండియాతో జరిగే ప్రతి మ్యాచ్ లో వాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని వింత కండిషన్స్ తెరపైకి తీసుకువచ్చిందట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.

అలాగే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నష్టపోకుండా సరైన న్యాయం చేయాలని కోరిందట. అయితే ఈ డిమాండ్లపై ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా సంచలన ప్రకటన చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. భార‌త్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తానని పాకిస్తాన్ కు ఇమ్రాన్ ఖ‌వాజా హామీ ఇచ్చినట్లు కూడా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ఎపిసోడ్ నేపథ్యంలో పాకిస్తాన్ పై చేయి సాధించిందని.. ఇండియాకు ఎదురు దెబ్బ తగిలినట్లు ఆ దేశానికి చెందిన సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే దీనిపై భారత జట్టు ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. పాకిస్తాన్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మకూడదని కోరుతున్నారు.

Next Story