ధోనీ నుంచే నేర్చుకున్నా : శివమ్ దూబె

by Dishanational3 |
ధోనీ నుంచే నేర్చుకున్నా : శివమ్ దూబె
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ ఎం.ఎస్ ధోనీ నుంచే మ్యాచ్‌లు ఎలా ముగించాలో నేర్చుకున్నానని టీమ్ ఇండియా యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబె తెలిపాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో తొలి టీ20లో దూబె అజేయ హాఫ్ సెంచరీతో మెరిసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం జియో సినిమాతో మాట్లాడిన శివమ్ దూబె.. తన ప్రదర్శన క్రెడిట్‌ను దిగ్గజ క్రికెటర్ ఎం.ఎస్ ధోనీకి ఇచ్చాడు. ‘మ్యాచ్‌లు ఎలా ముగించాలో ధోనీ నుంచి నేర్చుకున్నా. నేను బ్యాటింగ్ వచ్చేటప్పుడు అవే అమలు చేయాలనుకుంటా. ధోనీతో మాట్లాడేటప్పుడు వివిధ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో చెబుతాడు. సలహాలు ఇస్తాడు. నా బ్యాటింగ్‌కు రేటింగ్ ఇస్తాడు. ధోనీ నా బ్యాటింగ్‌కు రేటింగ్ ఇస్తే నేను బాగా ఆడతాను. నా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.’ అని దూబె తెలిపాడు. ధోనీ, రోహిత్ ఇద్దరూ తనకు మద్దతుగా నిలుస్తారని, తాను బాగా ఆడాలని కోరుకుంటారని చెప్పాడు. తన బౌలింగ్ ప్రదర్శనపై దూబె మాట్లాడుతూ..‘బౌలింగ్‌లో మార్పులు ఆకస్మాత్తుగా వచ్చినవి కావు. ఫిట్‌నెస్ కోసం నేను చాలా శ్రమించాను. అలాగే, దేశవాళీ క్రికెట్‌లో బౌలింగ్‌ను మెరుగుపర్చుకున్నాను.’ అని చెప్పుకొచ్చాడు. కాగా, ఐపీఎల్‌లో ధోనీ నాయకత్వం వహిస్తున్న చెన్నయ్ సూపర్ కింగ్స్‌కు దూబె ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

Next Story

Most Viewed