ఆసియా కప్‌కు హైదరాబాద్ క్రికెటర్ ఎంపిక.. పాక్‌తో మ్యాచ్ అప్పుడే

by Harish |

వచ్చే నెలలో జరగబోయే పురుషుల అండర్-19 క్రికెట్ ఆసియా కప్ టోర్నీలో పాల్గొనే భారత అండర్-19 జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది.

ఆసియా కప్‌కు హైదరాబాద్ క్రికెటర్ ఎంపిక.. పాక్‌తో మ్యాచ్ అప్పుడే
X

దిశ, స్పోర్ట్స్ : వచ్చే నెలలో జరగబోయే పురుషుల అండర్-19 క్రికెట్ ఆసియా కప్ టోర్నీలో పాల్గొనే భారత అండర్-19 జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. ఆయుశ్ మాత్రేను కెప్టెన్‌గా నియమించింది. ఈ ఏడాది ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనలో ఆయుశే సారథిగా ఉన్నాడు. ఆయుశ్ నాయకత్వంలో భారత అండర్-19 జట్టు ఆ రెండు టూర్లలోనూ వన్డే సిరీస్‌లను కైవసం చేసుకుంది. విహాన్ మల్హోత్రా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. హైదరాబాద్‌కు చెందిన ఆరోన్ జార్జ్‌కు జట్టులో స్థానం దక్కింది. ఇటీవల అఫ్గనిస్తాన్‌, భారత ‘ఏ’ జట్లతో జరిగిన అండర్-19 ట్రైయాంగిల్ సిరీస్‌లో జార్జ్ భారత ‘బి’ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా జట్టులో ఉన్నాడు. ఇటీవల వైభవ్ సూపర్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అభిగ్యాన్ కుండు, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, నమన్ పుష్పక్, దీపేశ్, హెనిల్ పటేల్ అండర్-19 జట్టులో తమ స్థానాలను కాపాడుకున్నారు. డిసెంబర్ 12 నుంచి దుబాయ్ వేదికగా ఆసియా కప్ ప్రారంభంకానుంది.

డిసెంబర్ 14న పాక్‌తో ఢీ

టోర్నీలో 8 జట్లు పాల్గొంటుండగా వాటిని రెండు గ్రూపులుగా విభజించారు. భారత్, పాక్ జట్లు ఒకే గ్రూపులో ఉన్నాయి. గ్రూపు-ఏలో భారత్, పాక్ జట్లను చేర్చగా.. డిసెంబర్ 14న ఈ దాయాదుల పోరు జరగనుంది. ఆ రెండు జట్లతోపాటు క్వాలిఫయర్ 1, క్వాలిఫయర్ 3 జట్లు ఖరారు కావాల్సి ఉంది. గ్రూపు–బిలో బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్తాన్‌లతోపాటు క్వాలిఫయర్-2 టీమ్‌ను చేర్చారు. అండర్-19 ప్రీమియర్ కప్ నుంచి మూడు క్వాలిఫయింగ్ జట్లు ఆసియా కప్‌కు అర్హత సాధిస్తాయి.

భారత అండర్-19 జట్టు

ఆయుశ్ మాత్రే(కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిగ్యాన్ కుండు, హర్వాన్ష్ సింగ్, యువ్‌రాజ్ గోహిల్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, నమన్ పుష్పక్, దీపేశ్, హెనిల్ పటేల్, కిషన్ కుమార్, ఉద్దవ్ మోహన్, ఆరోన్ జార్జ్.

స్టాండ్ బై ప్లేయర్లు : రాహుల్ కుమార్, హేమ్చుదేశన్, కిశోర్, ఆదిత్య రావత్.


Next Story