టీ20 వరల్డ్ కప్‌కు భారత విధ్వంసకర ఆటగాడు?.. హింట్ వచ్చేసింది

by Dishanational3 |
టీ20 వరల్డ్ కప్‌కు భారత విధ్వంసకర ఆటగాడు?.. హింట్ వచ్చేసింది
X

దిశ, స్పోర్ట్స్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ ఆటకు దూరమై దాదాపు 15 నెలలు అవుతుంది. అతను ప్రస్తుతం గాయాల నుంచి కోలుకున్నాడు. ఇటీవలే నేషనల్ క్రికెట్ అకాడమీ కూడా అతనికి ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో ఐపీఎల్‌తో పంత్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ సమయంలో భారత అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు బీసీసీఐ సెక్రెటరీ జై షా. త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌లో పంత్ ఆడటంపై హింట్ ఇచ్చారు.

తాజాగా జాతీయ మీడియాతో జై షా మాట్లాడుతూ.. ‘పంత్ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కీపింగ్ కూడా చేస్తున్నాడు. త్వరలోనే అతను ఫిట్‌గా ఉన్నాడని ప్రకటిస్తాం. పంత్ వికెట్ కీపింగ్ చేస్తే వరల్డ్ కప్ ఆడతాడు. ఐపీఎల్‌లో ఎలా రాణిస్తాడో చూడాలి. ఒకవేళ అతను పొట్టి ప్రపంచకప్‌లో పాల్గొనే జట్టు బలం పెరిగినట్టే. ఎందుకంటే, అతను మాకు చాలా పెద్ద ఆస్తి.’ అని తెలిపారు.

జై షా వ్యాఖ్యలతో పంత్ ప్రపంచకప్ బెర్త్ ఐపీఎల్‌లో ప్రదర్శనపై ఆధారపడి ఉందని అర్థమవుతుంది. అయితే, ఈ సీజన్‌లో పంత్ కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే ఉపయోగించుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. రెండు మోకాళ్లకు సర్జరీలు జరిగిన నేపథ్యంలో అతను పూర్తి స్థాయిలో కీపింగ్ బాధ్యతలు చేపట్టడంపై అనుమానాలు నెలకొన్నాయి. దీంతో అతని విషయంలో జట్టు రిస్క్ తీసుకోవద్దని అనుకుంటున్నది. పంత్ కీపింగ్ బాధ్యతలు చేపట్టడని ఢిల్లీ క్యాపిటల్స్ వర్గాలు ఇప్పటికే పలు సందర్భాల్లో తెలిపాయి. కాబట్టి, జట్టులోకి మరొకరి కీపింగ్ బాధ్యతలు మోయనున్నారు. పంత్‌ను కేవలం బ్యాటర్‌గా సద్వినియోగం చేసుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచనగా తెలుస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


Next Story

Most Viewed