Hong Kong Sixes : భారత్‌కు షాక్.. ఒకే రోజు మూడు మ్యాచ్‌ల్లో ఓటమి

by Harish |

హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో భారత్ పేలవ ప్రదర్శన చేసింది.

Hong Kong Sixes : భారత్‌కు షాక్.. ఒకే రోజు మూడు మ్యాచ్‌ల్లో ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో భారత్ పేలవ ప్రదర్శన చేసింది. టోర్నీ నుంచి ఎలిమినేట్ అవ్వడమే కాకుండా ఒకే రోజు మూడు పరాజయాలు చవిచూసింది. శనివారం జరిగిన చివరి గ్రూపు మ్యాచ్‌లో కువైట్ చేతిలో 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది. తొలి మ్యాచ్‌లో పాక్‌ను చిత్తు చేసిన భారత్.. కువైట్‌పై మాత్రం దారుణంగా విఫలమైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన కువైట్ 6 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 106 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ యాసిన్ పటేల్(58 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగాడు.

ఆ తర్వాత ఛేదనలో 3 వికెట్లు పడగొట్టి భారత్ ఓటమిని శాసించాడు. చేజింగ్‌లో భారత్ 5.4 ఓవర్లలోనే 79 పరుగులే చేసి ఆలౌటైంది. రాబిన్ ఊతప్ప(0), దినేశ్ కార్తీక్(8), స్టువర్ట్ బిన్నీ(2), ప్రియాంక్ పంచల్(17) నిరాశపరిచారు. క్వార్టర్స్ ఆశలు గల్లంతు చేసుకున్న భారత్ బౌల్ లీగ్ రౌండ్‌ ఆడగా.. అక్కడ కూడా దారుణంగా నిరాశపర్చింది. ముందుగా యూఏఈ చేతిలో ఓడిపోయింది. భారత జట్టు పెట్టిన 108 పరుగుల టఫ్ టార్గెట్‌ను యూఏఈ రెండే వికెట్లు కోల్పోయి మరో బంతి మిగిలి ఉండగానే ఛేదించింది. ఇక, నేపాల్‌తో మ్యాచ్‌లో మాత్రం దారుణంగా తేలిపోయింది. 92 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. ముందుగా నేపాల్ 137/0 స్కోరు చేయగా.. ఛేదనలో భారత్ 45 రన్స్‌కే ఆలౌటైంది.


Next Story